ఎవరు దర్యాప్తు చేసినా వేగంగా చేయాలి
ABN , First Publish Date - 2020-10-02T08:02:56+05:30 IST
స్కీముల పేరిట అక్రమ డిపాజిట్లు సేకరించి వందల కోట్ల కుంభకోణానికి పాల్పడిన హీరాగోల్డ్ సంస్థ
నౌహీరా కేసులో సుప్రీంకోర్టు వ్యాఖ్య
న్యూఢిల్లీ, అక్టోబరు 1 (ఆంధ్రజ్యోతి): స్కీముల పేరిట అక్రమ డిపాజిట్లు సేకరించి వందల కోట్ల కుంభకోణానికి పాల్పడిన హీరాగోల్డ్ సంస్థ నౌహీరా షేక్ కేసులో ఏ సంస్థ దర్యాప్తు జరిపినా వేగంగా చేయాలని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఈ కేసు దర్యాప్తును సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్కు బదిలీ చేస్తూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్పై గురువారం న్యాయమూర్తులు జస్టిస్ సంజయ్, జస్టిస్ హృషీకేశ్రాయ్తో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారణ జరిపింది.
ఈ కేసులో డబ్బుల వ్యవహారమే కాకుండా మోసం చేసిన విషయంలో వివిధ ఐపీసీ సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయని, వాటిపై దర్యాప్తు సాగించడానికి అనుమతించాలని తెలంగాణ ప్రభుత్వ న్యాయవాది ఉదయ్కుమార్ సాగర్ కోరారు. దాంతో ఏ సంస్థ దర్యాప్తు చేసినా అది వేగంగా ముందుకు సాగాలని కోర్టు అభిప్రాయపడింది.
మరోవైపు, నౌహీరా షేక్ దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్పై స్పందించిన ధర్మాసనం... ఈ కుంభకోణంలో మోసం విలువెంత? డిపాజిటర్లకు ఎంత చెల్లించారు? అన్న వివరాలను తమకు సమర్పించాలని ఆమె తరఫు న్యాయవాదులను సుప్రీంకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను నవంబరు 18కి వాయిదా వేసింది.