ఫీజులు ఇలానా?
ABN , First Publish Date - 2021-12-28T07:48:27+05:30 IST
రాష్ట్రంలోని ప్రైవేటు పాఠశాలలు, జూనియర్ కళాశాలల విషయంలో పాఠశాల విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్ సిఫారసు ఆధారంగా ఫీజులు నిర్ణయిస్తూ ప్రభుత్వం ఆగస్టు 24న జారీ చేసిన 53, 54 జీవోలను హైకోర్టు రద్దు చేసింది.
- భౌగోళికంగా విభజించడం సరికాదు
- గ్రామాల్లో అంతర్జాతీయ స్థాయి
- ప్రమాణాలున్న విద్యాసంస్థలు ఉన్నాయి
- వాటికీ, ఏ వసతీ లేని వాటికీ ఒకే ఫీజా?
- విద్యాసంస్థల నుంచి వివరాలు తీసుకోండి
- తల్లిదండ్రుల అభిప్రాయాలూ తెలుసుకోండి
- మార్చి 31లోగా ఫీజులు సిఫారసు చేయండి
- పాఠశాల విద్య కమిషన్కు హైకోర్టు ఆదేశం
- ఫీజులు సిఫారసు చేసే అధికారమే మీది
- నిర్ణయాధికారం ప్రభుత్వానిదేనని వ్యాఖ్య
- ప్రైవేటు స్కూళ్లు, జూనియర్ కళాశాలల
- ఫీజుల ఖరారు జీవోలు 53, 54 రద్దు
- కీలక తీర్పు వెలువరించిన న్యాయమూర్తి
అమరావతి, డిసెంబరు 27(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని ప్రైవేటు పాఠశాలలు, జూనియర్ కళాశాలల విషయంలో పాఠశాల విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్ సిఫారసు ఆధారంగా ఫీజులు నిర్ణయిస్తూ ప్రభుత్వం ఆగస్టు 24న జారీ చేసిన 53, 54 జీవోలను హైకోర్టు రద్దు చేసింది. విద్యాసంస్థలను భౌగోళికంగా విభజించి ఫీజులు నిర్ణయించడాన్ని తీవ్రంగా తప్పుబట్టింది. కమిషన్ నిబంధన 8ని అనుసరించి ఫీజు సిఫారసు విషయంలో వెంటనే నోటిఫికేషన్ జారీ చేయాలని కమిషన్ను ఆదేశించింది. ప్రతి ప్రైవేటు పాఠశాల, కళాశాల నుంచి వివరాలు ఆహ్వానించాలని స్పష్టం చేసింది. ఆయా వివరాల ఆధారంగా 2022 మార్చి 31లోగా కొత్త ఫీజులు సిఫారసు చేయాలని, వాటిని ప్రభుత్వం ఖరారు చేయాల ని తెలిపింది. ప్రభుత్వం ఖరారు చేయబోయే ఫీజుల కంటే 2021-22లో అధికంగా ఫీజులు వసూలు చేసి ఉంటే ఆ సొమ్ము తిరిగి విద్యార్థులకు చెల్లించాలని, తక్కువ వసూలు చేసిఉంటే విద్యార్థుల నుంచి రాబట్టవచ్చని యాజమాన్యాలకు స్పష్టం చేసింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యు.దుర్గాప్రసాదరావు సోమవారం కీలక తీర్పు ఇచ్చారు.
తీర్పులో ఏముందంటే..
‘‘చట్టప్రకారం ఫీజులను సిఫారసు చేసే అధికారం మాత్రమే కమిషన్కు ఉంది. నిర్ధారించే అధికారం లేదు. ప్రస్తుత వ్యాజ్యాలలోని రుసుములను పరిశీలిస్తే భౌగోళిక ప్రాంతాల వారీగా ఫీజులు ఖరారు చేసినట్లు కనపడుతోంది. గ్రామపంచాయితీ పరిధిలో అంతర్జాతీయ ప్రమాణాలతో ఏర్పాటు చేసిన విద్యాసంస్థకు, అదే ప్రాంతంలో మౌలిక సదుపాయాలు తక్కువగా ఉన్న విద్యాసంస్థకు ఒకే రకమైన ఫీజు నిర్ణయించడం సరికాదు. విద్యాసంస్థల నిర్వహణ అంత సులువుకాదు. మౌలికవసతులు, ఆటస్థలం, మరుగుదొడ్లు, నిర్వహణ ఖర్చులను పరిగణనలోకి తీసుకొని విద్యాసంస్థలను వర్గీకరించండి. ఆ తరువాతే ఫీజుల విషయంలో సిఫారసు చేయండి. ఫీజులు సిఫారసు చేసేముందు విద్యాసంస్థలు, విద్యార్థుల తల్లిదండ్రుల గురించి ఆలోచించండి. ఏటా ఫీజుల వివాదం తెరమీదికి వస్తుండడంతో తల్లిదండ్రులు అయోమయంలో పడుతున్నారు. ఫీజుల విషయంలో శాశ్వత పరిష్కార మార్గం కనుగొనండి’’ అని కమిషన్ను న్యాయమూర్తి ఆదేశించారు. రాష్ట్రంలోని ప్రైవేటు పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో ఫీజులు నిర్ణయిస్తూ ప్రభుత్వం ఆగస్టు 24న జారీ చేసిన జీవోలు 53, 54ని సవాల్ చేస్తూ తూర్పుగోదావరి జిల్లా ప్రైవేటు పాఠశాలల సంఘం అధ్యక్షుడు దాసరి దుర్గాశ్రీనివాసరావు, అలాగే జీవో 53ను సవాల్ చేస్తూ ఇండిపెండెంట్ స్కూల్స్ మేనేజ్మెంట్ అసోసియేషన్ అధ్యక్షుడు కె. శ్రీకాంత్బాబు మరికొన్ని విద్యాసంస్థలు హైకోర్టులో పిటిషన్లు దాఖలుచేశాయి. ఈ వ్యాజ్యాలపై ఇటీవల వాదనలు ముగియడంతో న్యాయమూర్తి తీర్పును రిజర్వ్ చేసి, సోమవారం వెల్లడించారు.
ఎలాంటి సంప్రదింపులు లేకుండానే!
పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాదులు వేదుల వెంకటరమణ, పి.వీరారెడ్డి, న్యాయవాది మతుకుమిల్లి విజయ్ వాదనలు వినిపించారు. ‘‘2021-24 విద్యాసంవత్సరాలకు గాను ఏడాదికి గరిష్ఠంగా నర్సరీ నుంచి 5వ తరగతి వరకు గ్రామాలలో రూ.10 వేలు, పట్టణాలలో రూ.11 వేలు, కార్పొరేషన్లలో రూ.12 వేలుగా ఫీజులు నిర్ణయించారు. 6 నుంచి 10వ తరగతివరకు గ్రామాలలో రూ.12 వేలు, పట్టణాలలో రూ.15 వేలు, కార్పొరేషన్లలో రూ.18 వేలుగా నిర్ణయిస్తూ ప్రభుత్వం జీవోలు ఇచ్చింది. ఫీజులు నిర్ధారించే ముందు విద్యాసంస్థల నుంచి కమిషన్ ఎలాంటి వివరాలు కోరలేదు. సమాచారం ఇవ్వాలని ఎలాంటి నోటిఫికేషన్ ఇవ్వలేదు. భౌగోళిక ప్రాంతాల ఆధారంగా ఫీజులు ఖరారు చేయడం చట్టవిరుద్ధం. జీవోలను రద్దు చేయండి’’ అని కోరారు. కమిషన్ తరఫున న్యాయవాది బీఎ్సఎన్ నాయుడు వాదనలు వినిపిస్తూ.. ప్రభుత్వం నిర్ణయించిన ఫీజులపై అభ్యంతరం ఉంటే ఆ విషయాన్ని పాఠశాలల యాజమాన్యాలు కమిషన్ దృష్టికి తీసుకురావచ్చునన్నారు. ఆ అవకాశాన్ని వినియోగించుకోకుండా నేరుగా కోర్టును ఆశ్రయించడం సరికాదన్నారు.