వజ్రోత్సవాలను ఘనంగా నిర్వహించాలి
ABN , First Publish Date - 2022-08-11T05:15:41+05:30 IST
వజ్రోత్సవాలను ఘనంగా నిర్వహించాలి
మేయర్ గుండు సుధారాణి
జీడబ్ల్యూఎంసీ(హనుమకొండ సిటీ), ఆగస్టు 10 : వజ్రోత్సవాల ఏర్పాట్లు ఘనంగా చేయాలని, ఈ మేరకు పనులు వేగవంతం కావాలని జీడబ్ల్యూఎంసీ అధికారులను మేయర్ గుండు సుధారాణి ఆదేశించారు. హనుమకొండలోని బల్దియా ప్రధాన కార్యాలయంలో బుధవారం కమిషనర్ ప్రావీణ్యతో కలిసి ఈనెల 22 వరకు జరిగే వజ్రోత్సవ కార్యక్రమాలు, వేడుక నిర్వహణ ఏర్పాట్లను సమీక్షించారు. ప్రధాన కార్యాలయంతోపాటు సర్కిల్ కార్యాలయాలను త్రివర్ణంగా విద్యుదీకరించాలని ఆదేశించారు. బల్దియా ప్రాంగణంలో వజ్రోత్సవాలను ప్రతిబింబించే స్థూపాన్ని ఏర్పాటు చేయాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు.
ఇంటింటికీ జాతీయజెండాల పంపిణీ కార్యక్రమం ఈ నెల 13లోగా పూర్తి కావాలన్నారు. 11వ తేదీన జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో నిర్వహించే ఫ్రీడమ్ రన్కు అవసరమైన ఏర్పాట్లు చేయాలన్నారు. 13న బల్దియా కార్యాలయంలో బెలూన్ల ప్రదర్శన, 16న ఉదయం 11 గంటలకు నగరంలోని 66 డివిజన్లలో కార్పొరేటర్ల నేతృత్వంలో తెలంగాణ రాష్ట్రీయ సామూహిక జాతీయ గీతాలాపనకు మైక్ సిస్టమ్ ఏర్పాట్లు చేయాలన్నారు.
19న క్రిష్టియన్ కాలనీ, పలివేల్పులలోని నైట్ షెల్టర్స్లో పండ్ల పంపిణీ జరపాలని, 20న హనుమకొండ, వరంగల్ ప్రాంతాల్లో మహిళా సమాఖ్యలతో జాతీయత అంశంపై రంగోళి పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు ప్రదానం చేయాలన్నారు. 21న కార్పొరేటర్లతో ప్రత్యేక కౌన్సిల్ సమావేశ నిర్వహణకు ఏర్పాట్లు చేయాలని మేయర్ సుధారాణి అధికారులను ఆదేశించారు.