వారిస్ పఠాన్ను మజ్లిస్ నుంచి బహిష్కరించాలి
ABN , First Publish Date - 2020-02-22T08:01:53+05:30 IST
మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఒవైసీ సమక్షంలోనే ఆ పార్టీ నేత వారిస్ పఠాన్ విద్వేష పూరిత ప్రసంగం చేశారని, అయినప్పటికీ ఒవైసీ ఆయనను ఎందుకు ఆపలేదని...
టీపీసీసీ అధికార ప్రతినిధి నిరంజన్
పఠాన్ను వివరణ కోరిన మజ్లిస్
హైదరాబాద్, ఫిబ్రవరి 21(ఆంధ్రజ్యోతి): మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఒవైసీ సమక్షంలోనే ఆ పార్టీ నేత వారిస్ పఠాన్ విద్వేష పూరిత ప్రసంగం చేశారని, అయినప్పటికీ ఒవైసీ ఆయనను ఎందుకు ఆపలేదని టీపీసీసీ అధికార ప్రతినిధి నిరంజన్ ప్రశ్నించారు. ‘‘రాష్ట్రంలోని దళితులు, బీసీలు, మైనారిటీలు ఒక వేదిక పైకి రావాలని అసదుద్దీన్ పిలుపునిస్తున్నారు. ఆయనకు చిత్తశుద్ధి ఉంటే పఠాన్ను వెంటనే పార్టీ నుంచి బహిష్కరించాలి’’ అని డిమాండ్ చేశారు. గతంలో అక్బరుద్దీన్ కూడా ఇలాంటి విద్వేష వ్యాఖ్యలు చేశారని, అప్పుడు కూడా పోలీసులు ప్రేక్షక పాత్ర పోషించారని అన్నారు. 15 కోట్ల మంది ముస్లింలు 100 కోట్ల మంది హిందువులతో సమానమని, వారికి తగిన సమాధానం ఇవ్వగలరని ఇటీవల కలబురిగిలో జరిగిన ఓ బహిరంగ సభలో వారిస్ పఠాన్ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. కాగా, వారిస్ పఠాన్ వ్యాఖ్యలపై మజ్లిస్ వివరణ కోరింది. మజ్లిస్ మహారాష్ట్ర చీఫ్ ఇంతియాజ్ జలీల్ శుక్రవారం విలేకరులతో మాట్లాడారు. వారిస్ పఠాన్ వ్యాఖ్యలను తమ పార్టీ సమర్థించడం లేదని, వివరణ కోరామని చెప్పారు.