జిల్లాలో భారీ వర్షం
ABN , First Publish Date - 2022-01-12T06:01:03+05:30 IST
జిల్లాలో భారీ వర్షం
- దుగ్గొండిలో రాళ్లవాన బీభత్సం
- విరిగిపడిన చెట్లు, లేచిపోయిన రేకుల షెడ్లు
- మూడుతండాలో నేలవాలిన మొక్కజొన్న చేను
దుగ్గొండి, జనవరి 11 : వరంగల్ జిల్లాలో మంగళవారం భారీ వర్షం కురిసింది. ఈదురు గాలులతో వాన పడడంతో పంటలు దెబ్బతిన్నాయి. రాళ్లవానతో ఇళ్లు ధ్వంసమయ్యాయి. దుగ్గొండి మండలంలో గాలివానతో పాటు రాళ్లవాన కురువడంతో చెట్లు, రేకులషెడ్డూలు లేచిపోయాయి. వెంకటాపురం, దుగ్గొండి, మహ్మదాపురం, చంద్రయ్య పల్లి, గోపాల పురం, మైసంపల్లి, మల్లంపల్లి, బల్వంతాపురంలో గాలి, రాళ్లవానతో చెట్లు కూలిపోవడంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. మహ్మదాపురంలో 11 కేవీ వైర్లు, రహదారిపై తాటిచెట్టు పడడంతో రాకపోకలు నిలిచి పోయాయి. బల్వంతాపురంలో పశువుల కొట్టం నుంచి ఇంటికి వస్తున్న రైతు పెండ్లి లింగన్నపై రాళ్ల వాన కురువడం తో గాయాలయ్యాయి. మైసంపల్లిలో రేకుల షెడ్డూలు లేచిపోయాయి.
పర్వతగిరిలో..
పర్వతగిరి : ఈదురుగాలులతో మొక్కజొన్న, మిర్చి పంటలు నేలవాలాయి. సోమవారం రాత్రి ఈదురుగాలులతో కూడిన వర్షం పడడంతో మండలంలోని ఇస్లావత్తండా పరిధిలోని మూడుతండాకు చెందిన మూడు వెంకన్న, ధరావత్ రవి సాగు చేసిన మొక్కజొన్న, మిరప తోటలు పూర్తిగా నేలవాలాయి. పంటలు చేతికొచ్చేదశలో కురిసిన వర్షాలకు పంటలు నేలవాలాయని, తమను ప్రభుత్వపరంగా ఆదుకోవాలని బాధిత రైతులు కోరారు.
చెన్నారావుపేటలో..
చెన్నారావుపేట : మండలంలోని పలు గ్రామాల్లో సోమవారం రాత్రి గంటపాటు కురిసిన అకాల వర్షంతో మొక్కజొన్న, మిర్చి పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. మండల కేంద్రానికి చెందిన చిరుతం రాజు రెండు ఎకరాల్లోని మొక్కజొన్న నెలవాలింది. అలాగే అక్కల్చెడ, కోనాపురం, ఉప్పరపల్లి, పాపయ్యపేటతో పాటు పలు గ్రామాలల్లో మిర్చి పంటలు దెబ్బతిన్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులను పంటలను పరిశీలించి, తమకు నష్టపరిహారంను అందించాలని వారు కోరుతున్నారు.
ఖానాపురంలో..
ఖానాపురం : మండలంలో సోమవారం రాత్రి కురిసిన అకాల వర్షంతో కొత్తూరు, రంగాపురం గ్రామాల్లో సుమారు 15 ఎకరాల్లో మొక్కజొన్న పంట నేలవాలినట్లు రైతులు మంగళవారం తెలిపారు. ఈ సందర్భంగా కొత్తూరు రైతుబంధు సమితి కోఆర్డినేటర్ బాలునాయక్ నేలవాలిన పంటపొలాలను పరిశీలించారు. ప్రభుత్వ పరంగా రైతులను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు.
గాడెపల్లిలో..
మామునూరు : ఖిలావరంగల్ మండలంలోని పలు విలీన గ్రామాల్లో రాత్రి కురిసిన అకాల వర్షానికి ఏపుగా పెరిగిన మొక్కజొన్న చేలు నేలవాలి పోయాయి. గాడెపలిలో వర్షానికి నేలవాలిన మొక్కజొన్న పంటలను 17వ డివిజన్ కార్పొరేటర్ గద్దెబాబు, డివిజన్ టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కత్తెరపల్లి దామోదర్, టీఆర్ఎస్ నాయకులతో సందర్శించారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు జనుపాల రాంబాబు, సదానందం, మేకల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.