AP News: పోలీసులు బహిరంగంగా ఫోటోలు తీశారంటూ యువకుడి ఆత్మహత్యాయత్నం
ABN , First Publish Date - 2022-07-26T17:35:13+05:30 IST
పోలీసులు బహిరంగంగా ఫోటోలు తీశారనే మనస్థాపంతో ఓ యువకుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన కృష్ణా జిల్లాలో చోటు చేసుకుంది.
విజయవాడ: పోలీసులు బహిరంగంగా ఫోటోలు తీశారనే మనస్థాపంతో ఓ యువకుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన కృష్ణా జిల్లాలో చోటు చేసుకుంది. బాపులపాడు మండలం కోడూరుపాడులో వసంత్ కుమార్ (23) అనే యువకుడు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. వెంటనే గమనించిన కుటుంబ సభ్యులు వసంత్ను వెంటనే ఆస్పత్రికి తరలించారు. యువకుడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. కోడూరుపాడులో కోడిపందాలు వద్ద పట్టుకుని పోలీసులు బహిరంగంగా ఫోటో తీసారన్న మనస్తాపంతో యువకుడు ఆత్మహత్య యత్నానికి పాల్పడినట్లు బంధువులు ఆరోపిస్తున్నారు. ఆదివారం కోడూరుపాడు శివారులో కోడిపందాలు వద్ద వసంత్ కుమార్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వసంత్ కుమార్ మనస్తాపంతో అదే రోజు సాయంత్రం ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడుతుండగా బంధువులు రక్షించారు.
కాగా... సోమవారం వసంత్ కుమార్ రెండవ సారి పురుగులు మందు తాగి బలవన్మరణానికి యత్నించాడు. ఎటువంటి అలవాటు లేని వసంత్ కుమార్ను పోలీసులు తీసుకువెళ్లి దుర్భాషలాడడంతోనే ఆత్మహత్యకు పాల్పడ్డాడని తల్లి లక్ష్మికుమారి ఆరోపించారు. గ్రామ నాలుగు రోడ్లు సెంటర్లో మోకాళ్ళపై నిలబెట్టి ఫోటో తీయడంతోనే రెండు సార్లు ఆత్మహత్యకు పాల్పడ్డాడని తెలిపారు. పోలీసులు వల్లే తన కొడుకు ప్రాణాపాయ స్థితిలో హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడని తల్లి ఆవేదన వ్యక్తం చేశారు. వసంత్ కుమార్ విజయవాడలోని ఎస్.ఆర్.ఆర్ కాలేజీలో బి.బి.ఏ చదువుతున్నాడు.