Vijayawadaలో పోలీసుల చెక్‌పోస్ట్‌లు... అడుగడుగునా తనిఖీలు

ABN , First Publish Date - 2022-02-03T13:30:15+05:30 IST

చలో విజయవాడ నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఉపాధ్యాయులు విజయవాడకు రాకుండా ఎక్కడికక్కడ పోలీసులు అడ్డుకుంటున్నారు.

Vijayawadaలో పోలీసుల చెక్‌పోస్ట్‌లు... అడుగడుగునా తనిఖీలు

అమరావతి: చలో విజయవాడ నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఉపాధ్యాయులు విజయవాడకు రాకుండా ఎక్కడికక్కడ పోలీసులు అడ్డుకుంటున్నారు. విజయవాడకు వచ్చే అన్ని రహదారులపై పోలీసులు చెక్‌పోస్ట్‌లు ఏర్పాటు చేసి అడుగడుగునా తనిఖీలు నిర్వహించారు. ఆర్టీసీ, ప్రైవేటు ట్రావెల్స్ బస్సులను, కార్లు, లారీలులను కూడా పోలీసు అధికారులు వదలని పరిస్థితి. టీచర్లు మారువేషాల్లో వస్తుండటంతో టూ వీలర్స్‌ను కూడా నిలిపివేసి ఐడి కార్డులు అడుగుతున్నారు. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు లోపలికి వెళ్లి తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే అనేకమందిని గుర్తించి వెనక్కి పంపామని అధికారులు చెబుతున్నారు. కౌన్సిలింగ్ ఇచ్చి పంపుతున్నామని పోలీసులు చెబుతున్నారు.


విజయవాడ నగరానికి రాష్ట్రంలోని అన్ని వైపుల నుంచి వచ్చే రహదారులపై చెక్‌పోస్ట్‌లు నిర్వహించి... విస్తృత తనిఖీలు చేపట్టారు. రాయలసీమ జిల్లాలు నెల్లూరు, ప్రకాశం గుంటూరు జిల్లాల నుంచి వచ్చే వాహనాలను కనకదుర్గమ్మ వారధి వద్ద తనిఖీ చేస్తున్నారు. జగ్గయ్యపేట, నందిగామ, మైలవరం,  హైదరాబాద్ జాతీయ రహదారిపై వచ్చే వాహనాలు గొల్లపూడివై జంక్షన్ వద్ద తనిఖీలు నిర్వహిస్తున్నారు. మచిలీపట్నం వైపు నుంచి వాహనాలు తాడిగడప వద్ద అదికారులు సోదాలు చేస్తున్నారు. ఉత్తరాంధ్ర, ఉభయగోదావరి జిల్లాలనుంచి వచ్చే వాహనాలను రామవరప్పాడు రింగు వద్ద పోలీసులు తనిఖీలు చేపట్టారు. 

Updated Date - 2022-02-03T13:30:15+05:30 IST