టీఆర్ఎస్ నేతల అహంకారం వెల్లడైంది: విజయశాంతి

ABN , First Publish Date - 2021-04-16T22:02:44+05:30 IST

సాగర్ ఉపఎన్నిక సందర్భంగా అధికార టీఆరెస్ పార్టీ నాయకులు, మంత్రులు చేసిన ప్రచారం తీరు చూస్తే వారిలో అహంకారం, పొగరు ఏ స్థాయిలో పెరిగిపోయాయన్నది ప్రజలకు మునుపెన్నడూ లేనంత స్పష్టంగా అర్థమైంది

టీఆర్ఎస్ నేతల అహంకారం వెల్లడైంది: విజయశాంతి

హైదరాబాద్: అధికార పార్టీ టీఆర్ఎస్ నాయకులు, మంత్రుల అహంకారం, పొగరు ఎంతలా పెరిగిపోయాయో సాగర్ ఉప ఎన్నిక సందర్భంగా ప్రజలకు స్పష్టంగా అర్థమైందని భారతీయ జనతా పార్టీ నేత విజయశాంతి అన్నారు. వారి దురుసుతనం మీడియా సాక్షిగా జనం దృష్టికి వచ్చిందని, తెలంగాణలో అధికార పార్టీ నేతల నిర్లక్ష్యపూరిత వైఖరిని ప్రతి సందర్భంలోనూ ప్రజలు రుచి చూస్తూనే ఉన్నారని ఆమె పేర్కొన్నారు. శుక్రవారం సోషల్ మీడియా ద్వారా ప్రభుత్వ నేతల వైఖరిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి జగదీష్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఈ సందర్భంగా ఉదహరించారు.


‘‘సాగర్ ఉపఎన్నిక సందర్భంగా అధికార టీఆరెస్ పార్టీ నాయకులు, మంత్రులు చేసిన ప్రచారం తీరు చూస్తే వారిలో అహంకారం, పొగరు ఏ స్థాయిలో పెరిగిపోయాయన్నది ప్రజలకు మునుపెన్నడూ లేనంత స్పష్టంగా అర్థమైంది. ముఖ్యమంత్రి కేసీఆర్ గారితో మొదలుపెట్టి మంత్రులు, ఇతర నేతలు అందరూ ప్రజల్ని అవమానించడంలో పోటీ పడుతున్నారు. ఫిబ్రవరిలో జరిగిన హాలియా సభలో విజ్ఞప్తి పత్రాలతో వచ్చిన మహిళలు, ఎస్టీలను కుక్కలు అంటూ కేసీఆర్ అవమానించారు. ఆ తర్వాత ఇటీవల అనుముల మండలం కొత్తపల్లిలో ప్రచారానికి వచ్చిన మంత్రి జగదీశ్ రెడ్డిని ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన ఒక నిరుద్యోగి ఉద్యోగాల భర్తీ, నిరుద్యోగభృతి హామీ గురించి అడిగినందుకు అతన్ని తొక్కిపడేస్తానంటూ కుక్కలతో పోల్చి అవమానించారు. వీరి దురుసుతనం మీడియా సాక్షిగా జనం దృష్టికి వచ్చింది. తెలంగాణలో అధికార పార్టీ నేతల నిర్లక్ష్యపూరిత వైఖరిని ప్రతి సందర్భంలోనూ ప్రజలు రుచి చూస్తూనే ఉన్నారు. పాలన చేతగాక... నిలదీసినవారికి తిట్లు, శాపనార్థాలు పెడుతున్నారు. వీరి యువనేత, మరో మంత్రి కేటీఆర్ కూడా ఏమీ తక్కువ కాదు. తెలంగాణ సర్కారు తప్పుల్ని ఎత్తి చూపినందుకు ఆయన ఏకంగా బీజేపీ నేతలకు చివరి వార్నింగ్ ఇచ్చారు. అది చాలక ప్రధాని మోదీ గారు, హోంమంత్రి అమిషా గారిపైనా తన అక్కసు వెళ్ళగక్కారు. ప్రజల మధ్యకు వచ్చినప్పుడైనా వినయంగా ఉండాలన్న ఇంగిత జ్ఞానం లేని ఈ తెలంగాణ పాలకులకు త్వరలోనే జనం గట్టి గుణపాఠం నేర్పడం ఖాయం’’ అని విజయశాంతి తన అధికారిక ఫేస్‌బుక్ ఖాతాలో రాసుకొచ్చారు.



Updated Date - 2021-04-16T22:02:44+05:30 IST