అంబరాన్నంటిన సిరిమాను సంబరం
ABN , First Publish Date - 2021-10-20T08:57:52+05:30 IST
ఉత్తరాంధ్రలో ప్రసిద్ధి చెందిన విజయనగరం పైడితల్లి అమ్మవారి సిరిమాను సంబరం మంగళవారం అంగరంగ వైభవంగా జరిగింది. ఉదయం నుంచే భక్తులు పెద్ద ఎత్తున అమ్మవారి దర్శనానికి చదురుగుడి వద్ద బారులు తీరారు. మధ్యాహ్నం 3.30 గంటలకు సిరిమాను
వైభవంగా విజయనగరం పైడితల్లమ్మ జాతర
దేవదాయ మంత్రి పట్టువస్ర్తాల సమర్పణ
(విజయనగరం-ఆంధ్రజ్యోతి)
ఉత్తరాంధ్రలో ప్రసిద్ధి చెందిన విజయనగరం పైడితల్లి అమ్మవారి సిరిమాను సంబరం మంగళవారం అంగరంగ వైభవంగా జరిగింది. ఉదయం నుంచే భక్తులు పెద్ద ఎత్తున అమ్మవారి దర్శనానికి చదురుగుడి వద్ద బారులు తీరారు. మధ్యాహ్నం 3.30 గంటలకు సిరిమాను ఊరేగింపు ప్రారంభమైంది. అమ్మవారి ప్రతిరూపంగా పూజారి బంటుపల్లి వెంకటరావు సిరిమాను అధిరోహించాక ఊరేగింపు మొదలైంది. జై పైడితల్లమ్మా.. జైజై పైడితల్లమ్మా.. అంటూ భక్తుల నినాదాల నడుమ సిరిమాను కదిలింది. చదురుగుడి నుంచి ప్రారంభమైన సిరిమాను నేరుగా పూసపాటి రాజ వంశీయుల కోట వద్దకు చేరుకుంది. ఇలా మూడుసార్లు కోటలోని శక్తిదేవతకు నమస్కరించి మళ్లీ చదురుగుడికి చేరుకుంది. ఆ సమయంలో భారీ వర్షం కురిసినా భక్తులు అక్కడి నుంచి కదల్లేదు. సాయంత్రం 5.20కి సిరిమానోత్సవం ముగిసింది. వేలాది మంది సంబరంలో పాల్గొన్నారు.
కోట బురుజు నుంచి పూసపాటి వీక్షణ
విజయనగరం రాజుల ఆడపడుచుగా భావించే పైడితల్లి అమ్మవారిని మాన్సాస్ చైర్మన్, కేంద్ర మాజీ మంత్రి పూసపాటి అశోక్గజపతిరాజు కోట బురుజు పైనుంచి వీక్షించారు. మంత్రులు వెల్లంపల్లి, బొత్స అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించి పూజలు నిర్వహించారు. కలెక్టర్ ఎ.సూర్యకుమారి ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఎస్పీ దీపికాపాటిల్ పర్యవేక్షణలో 2500 మంది సిబ్బందితో గట్టి బందోబస్తు నిర్వహించారు.