మంత్రి వెల్లంపల్లికి విభజన సెగ
ABN , First Publish Date - 2022-02-27T00:43:18+05:30 IST
మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్కు జిల్లా పునర్విభజన సెగ తగిలింది. ఆయన కాన్వాయ్ను శనివారం మార్కాపురం జిల్లా సాధన సమితి జేఏసీ నాయకులు అడ్డుకున్నారు.
మార్కాపురం: మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్కు జిల్లా పునర్విభజన సెగ తగిలింది. ఆయన కాన్వాయ్ను శనివారం మార్కాపురం జిల్లా సాధన సమితి జేఏసీ నాయకులు అడ్డుకున్నారు. శివరాత్రి ఉత్సవాల్లో పాల్గొనేందుకు శ్రీశైలం వెళ్తూ శ్రీలక్ష్మీ చెన్నకేశవస్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించేందుకు మంత్రి ప్రకాశం జిల్లా మార్కాపురంలో ఆగారు. ముందుగా ఎమ్మెల్యే నాగార్జునరెడ్డి ఇంటికి వెళ్లి అక్కడి నుంచి దేవస్థానానికి వెళుతున్న క్రమంలో మార్కాపురం జిల్లా సాధన సమితి చేపట్టిన రిలే దీక్ష శిబిరం వద్దకు రాగానే జేఏసీ నాయకులు మంత్రి కాన్వాయ్ను అడ్డుకున్నారు. పోలీసులు వారిని నిలువరించే ప్రయత్నాలు చేసి విఫలమయ్యాయి. దీంతో మంత్రి శ్రీనివాస్ కారులో నుంచి దిగి వారి సమస్యలను విన్నారు. మార్కాపురాన్ని ప్రత్యేక జిల్లా చేయాలని, పశ్చిమ ప్రకాశం ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ఆయనకు వివరించారు. విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని మంత్రి శ్రీనివాస్ హామీ ఇచ్చారు.