ప్రైవేటులోనూ ఓకే

ABN , First Publish Date - 2021-05-05T07:20:45+05:30 IST

రాష్ట్రంలో ప్రైవేటు ఆస్పత్రుల్లో కొవిడ్‌ వ్యాక్సినేషన్‌కు ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది.

ప్రైవేటులోనూ ఓకే

  • 45 దాటిన వారికే టీకా.. 
  • కొవిన్‌లో నమోదు తప్పనిసరి
  • 18-44 వయసువారు ఆగాల్సిందే.. 
  • ప్రైవేటు ఆస్పత్రులు వ్యాక్సిన్‌ కొనుక్కోవాల్సిందే 
  • మార్గదర్శకాలు జారీ చేసిన ప్రభుత్వం.. 
  • ప్రైవేటులో కొవాగ్జిన్‌ డోసు రూ.1300పైనే!
  • కొవిషీల్డ్‌ డోసు రూ.700.. గతంలో రూ.250


హైదరాబాద్‌, మే 4 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ప్రైవేటు ఆస్పత్రుల్లో కొవిడ్‌ వ్యాక్సినేషన్‌కు ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. అయితే, కేవలం 45 సంవత్సరాలు పైబడిన వారికే టీకాలు ఇవ్వాలని  స్పష్టం చేసింది. కొవిన్‌ పోర్టల్‌లో రిజిస్ట్రేషన్‌ చేసుకున్నవారికే టీకా ఇవ్వాలని ఆదేశించింది. 18-44 మధ్యవయస్కులకు వ్యాక్సినేషన్‌ ఇప్పుడు లేదని వెల్లడించింది. ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలను ప్రజారోగ్య సంచాలకుడు (డీహెచ్‌) డాక్టర్‌ గడల శ్రీనివాసరావు మంగళవారం విడుదల చేశారు. కేంద్రం మూడోదశ టీకా మార్గదర్శకాలు విడుదల చేసిన తర్వాత రాష్ట్రంలో ప్రైవేటు ఆస్పత్రుల్లో వ్యాక్సినేషన్‌కు ప్రభుత్వం అనుమతినివ్వలేదు. 


ఫలితంగా మే 1 నుంచి ప్రైవేటు కేంద్రాల్లో వ్యాక్సినేషన్‌ ప్రక్రియ నిలిచిపోయింది. మే 1కి ముందు.. కొవిన్‌లో నమోదు చేసుకున్నవారికే కాక, స్పాట్‌ రిజిస్ట్రేషన్‌ విధానంలో కూడా టీకాలు వేసేవారు. కానీ.. టీకాల ఉత్పత్తి తక్కువగా ఉండడం, మే 1 నుంచి 18 సంవత్సరాలు పైబడిన వారందరికీ టీకాలిచ్చేందుకు కేంద్రం గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వడంతో ఒక్కసారి వ్యాక్సిన్‌కు భారీ డిమాండ్‌ ఏర్పడింది. అందుకే ఇప్పుడు కొవిన్‌లో నమోదును రాష్ట్ర సర్కారు తప్పనిసరి చేసింది. నేరుగా వచ్చి టీకా తీసుకునే వెసులుబాటును తొలగించింది. అలాగే.. 18-44 వయసువారికి టీకాపై  విధానపరమైన నిర్ణయం తీసుకున్న తర్వాతే వారికి వ్యాక్సినేషన్‌ మొదలవుతుందని మార్గదర్శకాల్లో పేర్కొంది. ఈ మార్గదర్శకాలకు విరుద్ధంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని అందులో హెచ్చరించింది.


కొనుక్కోవాల్సిందే...

ప్రైవేటు ఆస్పత్రులు తమ వద్ద వేసే టీకాలను ఉత్పత్తి సంస్థల నుంచి నేరుగా కొనుగోలు చేసుకోవాలని ప్రభుత్వం తన మార్గదర్శకాల్లో పేర్కొంది. ఇప్పటివరకు ప్రైవేటు ఆస్పత్రులు కేంద్రం సూచించిన ఖాతాలో డబ్బులు జమ చేసి.. ఆ రసీదును ప్రజారోగ్య సంచాలకుడికి ఇచ్చేవి. ఆ మొత్తానికి సరిపడ వ్యాక్సిన్‌ను ప్రైవేటు ఆస్పత్రులకు రాష్ట్ర వ్యాక్సిన్‌ స్టోరేజ్‌ సెంటర్‌ నుంచి ఇచ్చేవారు. కొవిషీల్డ్‌, కొవాగ్జిన్‌లకు ఒకే ధర చెల్లించేవారు. ఒక్కో డోసుకు రూ. 150 చొప్పున చెల్లించి ప్రైవేటు ఆస్పత్రులు కొనుగోలు చేసేవి. డోసు ధరకు అదనంగా రూ.100 సర్వీస్‌ చార్జీ కింద ప్రజల నుంచి వసూలు చేసేవి. దాంతో ఒక్కో డోసు ఇప్పటివరకు రూ.250 దొరికేది. కానీ.. ఇప్పుడు ప్రైవేటు ఆస్పత్రులు నేరుగా కంపెనీల నుంచే టీకాలు కొనుక్కోవాల్సి ఉంటుందని ప్రభుత్వం చెప్పడంతో ఆ మేరకు ధరలు పెరగనున్నాయి. 


కంపెనీలు ప్రైవేటుకు ఇచ్చే ధర ఎంతో ఇప్పటికే నిర్ణయించాయి. దాని ప్రకారం.. కొవాగ్జిన్‌ ఒక్కో డోసు ధర రూ.1200 ఉండగా, కొవిషీల్డ్‌ మాత్రం రూ.600 ఉంది. ఆ ధరలను చెల్లించి ప్రైవేటు ఆస్పత్రులు ఉత్పత్తి కంపెనీల నుంచి కొనుగోలు చేయాల్సివుంటుంది. ప్రైవేటులో టీకా తీసుకునే వారు ఈ ధరతో పాటు ఒక్కో డోసుకు సర్వీస్‌ చార్జీ కింద రూ. 100 అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. అంటే ప్రైవేటు టీకా కేంద్రాల్లో కొవాగ్జిన్‌ ధర ఒక్కో డోసుకు రూ.1300, కొవిషీల్డ్‌ అయితే రూ. 700 చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. ప్రభుత్వ టీకా కేంద్రాలకు కూడా నేరుగా వస్తే వ్యాక్సిన్‌ ఇవ్వబోమని.. తప్పనిసరిగా కొవిన్‌ పోర్టల్‌లో స్లాట్‌ బుక్‌ చేసుకోవాలని వైద్య ఆరోగ్యశాఖ మరోమారు స్పష్టం చేసింది. ఈ మేరకు డీహెచ్‌ డాక్టర్‌ గడల శ్రీనివాసరావు సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు.

Updated Date - 2021-05-05T07:20:45+05:30 IST