కరోనా కోరల్లో మాజీ క్రికెటర్
ABN , First Publish Date - 2020-07-12T22:15:03+05:30 IST
భారత్లో కరోనా మహమ్మారి రోజురోజుకు విజృంభిస్తోంది. ఎందరో సెలబ్రిటీలు దీని బారిన పడుతున్నారు. సినీతారలు, క్రీడాకారులు...
న్యూఢిల్లీ: భారత్లో కరోనా మహమ్మారి రోజురోజుకు విజృంభిస్తోంది. ఎందరో సెలబ్రిటీలు దీని బారిన పడుతున్నారు. సినీతారలు, క్రీడాకారులు ఎవరినీ ఈ మహమ్మారి విడిచిపెట్టడం లేదు. భారత మాజీ క్రికెటర్, ఒకప్పటి లోక్సభ ఎంపీ, ప్రస్తుత యూపీ కాబినెట్ మినిస్టర్ చేతన్ చౌహాన్కు కరోనా పాజిటివ్ వచ్చింది. ఈ విషయాన్ని క్రికెట్ కామెంటేటర్ ఆకాష్ చోప్రా తన ట్విటర్ ద్వారా వెల్లడించారు. ప్రస్తుతం చౌహాన్ లక్నోలోని సంజయ్ గాంధీ పీజీఐ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రభుత్వం ఆయన కుంటుంబ సభ్యులకు కూడా కరోనా పరీక్షను చేయనుంది. చౌహాన్ కుంటుంబ సభ్యులందరిని హోమ్ క్వారంటైన్లో ఉంచారు. చౌహాన్కు కరోనా పాజిటివ్ విషయంపై ఆకాశ్ చోప్రాతో పాటు ఆర్పీ సింగ్ కూడా స్పందించారు.
చేతన్ చౌహాన్ జీకి కరోనా పాజిటివ్ రావడం బాధాకరమని, ఆయన త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నానని ట్విటర్ ద్వారా పేర్కొన్నారు. ఇదిలా ఉంటే చేతన్ చౌహాన్ 1969-1978 మధ్య 40 టెస్ట్ మ్యచ్లు ఆడారు. అందులో 2084 పరుగులు చేశారు. అప్పట్లో గవాస్కర్తో కలిసి ఎన్నో గొప్ప ఓపెనింగ్ ఇన్నింగ్స్ నెలకొల్పారు. ఇద్దరి పాట్నర్షిప్లో 3000కు పైగా పరుగులు చేశారు.