నేషనల్‌ బుక్‌ట్రస్ట్‌..తొలి తెలుగు ఎడిటర్‌..ఉషారాణి కన్నుమూత

ABN , First Publish Date - 2020-12-29T07:50:45+05:30 IST

నేషనల్‌ బుక్‌ ట్రస్ట్‌ తెలుగు విభాగం తొలి ఎడిటర్‌, రచయిత్రి ఉషారాణి భాటియా (89) కన్నుమూశారు. కొంతకాలంగా అల్జీమర్స్‌తో బాధపడుతున్న ఆమె సోమవారం ఢిల్లీలోని స్వగృహంలో తుదిశ్వాస విడిచారు.

నేషనల్‌ బుక్‌ట్రస్ట్‌..తొలి తెలుగు ఎడిటర్‌..ఉషారాణి కన్నుమూత

హైదరాబాద్‌ సిటీ, డిసెంబరు 28(ఆంధ్రజ్యోతి): నేషనల్‌ బుక్‌ ట్రస్ట్‌ తెలుగు విభాగం తొలి ఎడిటర్‌, రచయిత్రి ఉషారాణి భాటియా (89) కన్నుమూశారు. కొంతకాలంగా అల్జీమర్స్‌తో బాధపడుతున్న ఆమె సోమవారం ఢిల్లీలోని స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. ఉషారాణి.. తొలి తరం సినీ, రంగస్థల నటి కొమ్మూరి పద్మావతీ దేవి చిన్న కుమార్తె. ప్రసిద్ధ రచయిత చలంకు స్వయానా తమ్ముడి కుమార్తె. మరో ప్రసిద్ధ రచయిత  కొడవటిగంటి కుటుంబరావుకు మరదలు. పద్మావతీ దేవి పెద్ద కూతురు వరూధినిని కొడవటిగంటి కుటుంబరావుకు ఇచ్చి వివాహం చేశారు. కాగా, ఉషారాణి చెన్నైలో పుట్టి పెరిగారు. మద్రాసు యూనివర్సిటీలో న్యాయ శాస్త్రం అభ్యసించారు. దుర్గాబాయ్‌ దేశ్‌ముఖ్‌ సలహా మేరకు ఢిల్లీలోని సెంట్రల్‌ సోషల్‌ వెల్ఫేర్‌ బోర్డు ఆంగ్ల పత్రికకు అసిస్టెంట్‌ ఎడిటర్‌గా పనిచేశారు. అనంతరం నేషనల్‌ బుక్‌ ట్రస్ట్‌ తెలుగు శాఖ తొలి ఎడిటర్‌గా బాధ్యతలు చేపట్టారు. 1990లో పదవీ విరమణ పొందారు. తొలినాళ్లలో ఆంధ్రపత్రికలోనూ పనిచేశారు. 


బాల సాహిత్యాన్ని తెలుగుకు చేరువ చేసి..

బాలల సాహిత్యంలోని జాతీయ, అంతర్జాతీయ ఉత్తమ రచనలను తెలుగు పాఠక లోకానికి పరిచయం చేసిన ఘనత ఉషారాణికి దక్కుతుంది. ఆమె కొన్ని కథలు, ‘అడవిలో చిన్నారి’, ‘తండ్రీ కూతురు’, ‘అరుణోదయం’, ‘ప్రతీకారం’ తదితర నవలలు రాశారు. ఆమె రాసిన కథలు ‘వంతెన’ కథా సంపుటిగా వెలువడ్డాయి. ఉషారాణి పలు అనువాదాలు చేశారు. ఆమె రచనల్లో కొన్ని హిందీలోనూ అనువాదమయ్యాయి. ఉషారాణి పంజాబ్‌కు చెందిన సుమీందర్‌సింగ్‌ భాటియాను ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి కూతురు సుజాత ఉన్నారు. సుమీందర్‌ సింగ్‌ 18 ఏళ్ల కిందట కన్నుమూశారు. ఉషారాణి మృతికి నేషనల్‌ బుక్‌ ట్రస్ట్‌ తెలుగు శాఖ ఎడిటర్‌ పత్తిపాక మోహన్‌ సంతాపం తెలిపారు.

Updated Date - 2020-12-29T07:50:45+05:30 IST