భారత్లో తయారైన వయాగ్రా డ్రగ్స్ యూఎస్లో సీజ్!
ABN , First Publish Date - 2021-07-31T17:32:15+05:30 IST
అమెరికా కస్టమ్స్ అధికారులు శుక్రవారం సుమారు రూ. 5.30 కోట్లు విలువ చేసే 23 వేలకు పైగా సిల్డెనాఫిల్ సిట్రేట్ పిల్స్ను సీజ్ చేశారు.
వాషింగ్టన్: అమెరికా కస్టమ్స్ అధికారులు శుక్రవారం సుమారు రూ. 5.30 కోట్లు విలువ చేసే 23 వేలకు పైగా సిల్డెనాఫిల్ సిట్రేట్ పిల్స్ను సీజ్ చేశారు. ఈ డ్రగ్స్ను ప్రధానంగా వయాగ్రా ట్యాబ్లెట్ల తయారీలో వినియోగిస్తారు. కాగా, సీజ్ చేసిన పిల్స్ భారత్లో తయారైనట్లు అధికారులు గుర్తించారు. వీటి మార్కెట్ విలువ 712,756 డాలర్లు(భారత కరెన్సీలో రూ. 5,30,14,292) ఉంటుందని అధికారులు తెలిపారు. సుమారు 20 కిలోల బరువైన మాత్రలను కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
భారత్ నుంచి వచ్చిన ఈ పిల్స్ను జార్జియాలోని డెకాటర్లో ఉన్న ఓ అపార్ట్మెంట్కు తరలిస్తున్న సమయంలో కస్టమ్స్ అధికారులు వీటిని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం సీజ్ చేసి సిన్సిన్సాటీకి తరలించినట్లు యూఎస్ కస్టమ్స్ అండ్ బార్డర్ ప్రొటెక్షన్(సీబీపీ) అధికారులు తెలిపారు. కాగా, ప్రిస్క్రిప్షన్ మెడిసిన్స్ దిగుమతిపై అగ్రరాజ్యంలో ఆంక్షలు ఉంటాయి. ఎఫ్డీఏ(ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్) నిబంధనలకు అనుగుణంగా వీటిని దిగుమతి చేసుకోవాల్సి ఉంటుంది. కానీ, తాజాగా పట్టుబడిన డ్రగ్స్ అక్రమ మార్గంలో అమెరికా వచ్చాయని కస్టమ్స్ అధికారులు పేర్కొన్నారు.