భయంతో బతికిన చోటే ఇప్పుడు బిందాస్.. బైడెన్‌కు థాంక్స్ చెబుతున్న అమెరికన్లు..

ABN , First Publish Date - 2021-05-02T14:36:15+05:30 IST

అగ్రరాజ్యం అమెరికాలో ప్రస్తుతం పరిస్థితులు మళ్లీ కుదుటపడుతున్నాయి. కరోనా మహమ్మారి విజృంభణతో అన్ని దేశాలకన్నా ఎక్కువగా నష్టపోయింది అమెరికానే అనడంలో ఎటువంటి సందేహమూ లేదు. ఇలాంటి పరిస్థితుల నుంచి అగ్రరాజ్యం కోలుకుంటోంది. కరోనాను నియంత్రించడంలో చాలా వరకు సక్సెస్ సాధించారు.

భయంతో బతికిన చోటే ఇప్పుడు బిందాస్.. బైడెన్‌కు థాంక్స్ చెబుతున్న అమెరికన్లు..

ప్రపంచాన్ని గజగజ వణికిస్తున్న కరోనా మహమ్మారి పుట్టింది చైనాలోని వూహాన్‌లో అన్న విషయం అందరికీ తెలిసిందే. ఆ తర్వాత ఈ వైరస్ అక్కడి నుంచి ప్రపంచదేశాలన్నింటికీ పాకింది. ముఖ్యంగా ఈ వైరస్ వల్ల అగ్రరాజ్యం అమెరికా అతలాకుతలం అయిపోయింది. గతేడాది అమెరికాలో ఈ వైరస్ సృష్టించిన బీభత్సం అంతా ఇంతా కాదు. ఇప్పటికీ ఇక్కడే అత్యధిక కరోనా కేసులు, మరణాలు ఉన్నాయి. న్యూయార్క్ వంటి మహానగరాల్లో అయితే ప్రస్తుత భారతదేశ పరిస్థితుల కన్నా ఘోరమైన పరిస్థితులు గతేడాది కనిపించాయి. మాజీ అధ్యక్షుడు ట్రంప్ నిర్లక్ష్యం వల్లే విపత్కర పరిస్థితులు తలెత్తాయనే విమర్శలు వచ్చాయి. అయితే ప్రభుత్వం మారిన తర్వాత అమెరికా తలరాత కూడా మారినట్లే కనబడుతోంది.


ప్రస్తుతం అగ్రరాజ్యంలో పరిస్థితులు మళ్లీ కుదుటపడుతున్నాయి. కరోనా మహమ్మారి విజృంభణతో అన్ని దేశాలకన్నా ఎక్కువగా నష్టపోయింది అమెరికానే అనడంలో ఎటువంటి సందేహమూ లేదు. ఇలాంటి పరిస్థితుల నుంచి అగ్రరాజ్యం కోలుకుంటోంది. ఇక్కడ కరోనాను నియంత్రించడంలో తాజా ప్రభుత్వం చాలా వరకు సక్సెస్ సాధించింది.


అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో కూడా ఈ అంశం కీలకపాత్ర పోషించిన సంగతి తెలిసిందే. మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఓటమికి కరోనా కూడా ఒక కారణం అనడం అతిశయోక్తి కాదు. ఇటలీలో కరోనా మహమ్మారితో వేలకు వేలమంది మరణిస్తున్న సమయంలో ఈ వైరస్‌పై అమెరికా పెద్దగా దృష్టి పెట్టలేదు. ఆ తర్వాత అమెరికాలోనే నెమ్మదిగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతుండగా కూడా ముంచుకొస్తున్న ప్రమాదాన్ని పసిగట్టడంలో ట్రంప్ విఫలమయ్యారు. ఇది పెద్ద సమస్య కాదని తేల్చేశారు.


అయితే ఆ తర్వాత పరిస్థితి చేయిదాటిపోయింది. అమెరికాలో రోజురోజుకూ పరిస్థితి దిగజారింది. లక్షల్లో కరోనా కేసులు, వేలల్లో మరణాలు రోజువారీ వార్తలైపోయాయి. ప్రతిరోజూ సుమారు 2లక్షల కరోనా కేసులు, 3వేలపైగా మరణాలు సంభవించడం సర్వసాధారణం అయిపోయింది. పరిస్థితి ఇంత భయంకరంగా మారినప్పటికీ అంటువ్యాధి నిపుణులు ఆంథనీ ఫౌసీ వంటి వారి సూచనలను ట్రంప్ చెవికెక్కించుకోలేదు. అంతా చైనా తప్పేనంటూ వాదించారు. కరోనాను ‘చైనీస్ వైరస్’ అంటూ మరో వివాదానికి దారితీశారు. ఆ తర్వాత అమెరికాలో ఆసియన్-అమెరికన్లపై జాత్యహంకార దాడులు పెరిగిపోయాయి.


ఇలాంటి సమయంలో అధ్యక్ష ఎన్నికలకు సమయం ఆసన్నమైంది. అప్పుడు కూడా కరోనా విషయంలో ప్రభుత్వ వైఫల్యాన్ని ట్రంప్ తోసిపుచ్చారు. మాట్లాడితే చైనాను తప్పుబడుతూ తప్పించుకు తిరిగారు. ఈ విషయంలో ట్రంప్ ఎంతలా విఫలం అయ్యారంటే ట్రంప్ మాటలకన్నా, డాక్టర్ ఫౌసీ మాటలకే ప్రజలు ప్రాముఖ్యతనిచ్చారు. కరోనాను నియంత్రించడానికి నిర్దిష్ట ప్రణాళికను సిద్దం చేయడంలో కూడా ట్రంప్ ప్రభుత్వం విఫలమైంది.



ఇదే అంశాన్ని లేవనెత్తి, ముఖ్యంగా కరోనా విషయంలో ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టిన బైడెన్.. తాను అధికారంలోకి వస్తే కరోనాపై ఫోకస్ పెట్టి వైరస్‌ను నియంత్రించడానికి శాయశక్తులా ప్రయత్నిస్తానని హామీ ఇచ్చారు. అప్పటికే ట్రంప్ విధానాలతో అసంతృప్తిగా ఉన్న విదేశీ అమెరికన్లకు బైడెన్ ఒక ఆశాదీపంలా కనిపించారు. అమెరికన్లకు కూడా కరోనా విలయం వణుకు పుట్టించి, దాన్ని నియంత్రిస్తానని బైడెన్ చెప్పడం కొంత ఊరటనిచ్చింది. ఎన్నికల్లో బైడెన్ ఘనవిజయం సాధించారు.


ఆ వెంటనే కరోనా విషయంలో ఆంథనీ ఫౌసీ వంటి నిపుణుల సలహాలు పాటించిన బైడెన్.. ఫౌసీని అమెరికా ఆరోగ్యశాఖ సలహాదారుగా నియమించారు. తాను అధికారం చేపట్టిన 100 రోజుల్లో 100 మిలియన్లు (10 కోట్ల) మందికి వ్యాక్సిన్ అందించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ప్రకటించారు. దీనిపై కూడా విమర్శలు వచ్చాయి. 100 రోజుల్లో 10 కోట్ల మందికి వ్యాక్సిన్ ఇవ్వడం సరిపోదని, మరింత వేగంగా పనిజరగాలని అన్నారు.


అయితే బైడెన్ ప్రభుత్వం అనుకున్న 10 కోట్ల మందికి వ్యాక్సినేషన్ లక్ష్యాన్ని 58 రోజుల్లోనే చేరుకుంది. వెంటనే 100 రోజులు ముగిసేసరికి మరో 10 కోట్లమందికి వ్యాక్సిన్ ఇవ్వడం లక్ష్యమని బైడెన్ ప్రకటించారు. ఈ లక్ష్యాన్ని కూడా ప్రభుత్వం 92 రోజుల్లోనే సాధించింది. దేశంలో జరుగుతున్న వ్యాక్సినేషన్ ప్రక్రియ గురించి సెంటర్స్ ఫర్ డిసీజ్ ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ సెంటర్లు వివరిస్తూ.. ఇప్పటికి దేశంలోని పెద్దవారిలో సగంమందికిపైగా ప్రజలకు వ్యాక్సిన్ ఇవ్వడం జరిగిందని చెప్పారు.


వ్యాక్సినేషన్ విషయంలో బైడెన్ ప్రభుత్వం చాలా జాగ్రత్తలు తీసుకుంది. ఫైజర్ వ్యాక్సిన్‌తోపాటు అందుబాటులో లభించిన వ్యాక్సిన్లన్నింటినీ సేకరించింది. జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీ తయారు చేసిన సింగిల్ డోస్ వ్యాక్సిన్‌ను కూడా సేకరించింది. దీని వల్ల కొందరిలో సైడ్ ఎఫెక్ట్స్ రావడంతో తాత్కాలికంగా నిలిపివేసి, పెద్దగా రిస్క్ లేదని భావించిన తర్వాత మళ్లీ ఈ వ్యాక్సిన్ వినియోగానికి పచ్చజెండా ఊపింది.


వ్యాక్సినేషన్ జరగడం వల్ల కరోనా వ్యాప్తి చాలా వరకూ తగ్గిపోయింది. గతంలో రోజూ లక్షల్లో నమోదైన కరోనా కేసులు ప్రస్తుతం వేలల్లోకి చేరాయి. తాజాగా అమెరికాలో శనివారం నాడు 42,034 కరోనా కేసులు, 661 మరణాలు మాత్రమే నమోదయ్యాయి. గతంలో ప్రతిరోజూ కనిపించిన శవాల కుప్పలతో పోల్చుకుంటే పరిస్థితి చాలా వరకూ మెరుగైందనే చెప్పాలి. మొత్తమ్మీద ఇప్పటి వరకూ అమెరికాలో 3.3 కోట్ల కరోనా పాజిటివ్ కేసులు నమోదవగా, 5.9 లక్షల మంది ఈ మహమ్మారికి బలయ్యారు.



కరోనా కారణంగా ఉద్యోగాలు కోల్పోయి, ఆర్థిక కష్టాల్లో ఉన్న వారికి కూడా బైడెన్ ప్రభుత్వం అండగా నిలిచింది. అధికారం చేపట్టినప్పుడే ప్రజల కోసం కరోనా ఉద్దీపన ప్యాకేజి ఉంటుందని చెప్పిన బైడెన్.. దీని కోసం కాంగ్రెస్‌పై కూడా కొంత ఒత్తిడి తీసుకొచ్చి మరీ బిల్లు పాసయ్యేలా చూశారు. ప్రజల్లో కూడా అధికశాతం ఈ ప్యాకేజికి మద్దతు లభించడంతో బైడెన్ ప్రభుత్వంపై ప్రజలకు నమ్మకం ఏర్పడింది. ప్రజలకు మూడు విడతలుగా చెక్కుల రూపంలో ఆర్థిక సాయం అందించిన బైడెన్ సర్కారు.. పిల్లలు, విద్యార్థులు, కుటుంబాలకు సాయం చేసేందుకు మరో 1.8 ట్రిలియన్ డాలర్ల ప్యాకేజి ప్రకటించే యోచనలో ఉన్నట్లు తెలిపింది. దీనికి కూడా అధిక శాతం ప్రజలకు మద్దతు తెలిపారు. 


అదే విధంగా బైడెన్ పాలకవర్గంలో చాలా భిన్నత్వం కనిపిస్తుంది. తన కేబినెట్‌లో అధికశాతం మహిళలు, నాన్-వైట్ ప్రజలకు బైడెన్ అవకాశం ఇచ్చారు. అమెరికా గత అధ్యక్షుల్లో ఎవరూ ఇవ్వనంతగా వైవిధ్యానికి బైడెన్ పెద్దపీట వేశారు. బైడెన్ టీంలో తొలిసారిగా నల్లజాతీయుడైన లాయిడ్ ఆస్టిన్‌ను రక్షణశాఖ సెక్రటరీగా నియమించారు. అదే విధంగా ఒక గే వ్యక్తిని ట్రాన్స్‌పోర్టేషన్(రవాణా) సెక్రటరీగా, సెక్రటరీ ఆఫ్ ది ఇంటీరియర్‌గా తొలిసారి నేటివ్ అమెరికన్ అయిన డెబ్ హాలాండ్‌ను, ట్రెజరీ(ఖజానా) విభాగాధిపతిగా తొలిసారి జానెట్ యెలెన్‌ అనే మహిళను, జేవియర్ బెకెర్రా అనే లాటినో వ్యక్తిని తొలిసారిగా హెల్త్ అండ్ హ్యూమన్ సర్వీసెస్ సెక్రటరీగా నియమించారు.


గత అధ్యక్షులు ఇంతమందికి అసలు అవకాశమే ఇవ్వలేదు. ఇచ్చిన కొంతమందికి కూడా అంతగా ప్రాధాన్యం లేని వెటరన్ అఫైర్స్, డిపార్ట్‌మెంట్ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ డెవలప్‌మెంట్, లేబర్ డిపార్ట్‌మెంట్ వంటి శాఖలు కేటాయించారు. తాను అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు ‘అమెరికాను తలపించే’ కేబినెట్‌ను ఏర్పాటు చేస్తానన్న బైడెన్.. ఇలా వైవిధ్యమైన కేబినెట్ ఏర్పాటు చేయడం ఆయా వర్గాల ప్రజల్లో కూడా చాలా నమ్మకాన్ని సంపాదించింది.

Updated Date - 2021-05-02T14:36:15+05:30 IST