నగర వాసులకు అందుబాటులో మరో అర్బన్ ఫారెస్ట్ పార్కు
ABN , First Publish Date - 2022-01-26T20:33:55+05:30 IST
గ్రేటర్ హైదరాబాద్ ప్రజలకు మరో అర్భన్ ఫారెస్ట్ పార్క్ అందుబాటులోకి వచ్చింది. కుత్బుల్లాపూర్ మండలం గాజులరామారంలో ప్రాణవాయువు అర్భన్ ఫారెస్ట్ పార్క్ ను ఏర్పాటు చేశారు.
హైదాబాద్: గ్రేటర్ హైదరాబాద్ ప్రజలకు మరో అర్భన్ ఫారెస్ట్ పార్క్ అందుబాటులోకి వచ్చింది. కుత్బుల్లాపూర్ మండలం గాజులరామారంలో ప్రాణవాయువు అర్భన్ ఫారెస్ట్ పార్క్ ను ఏర్పాటు చేశారు. ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్, అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి దీనిని ప్రారంభించారు. సీఎం కేసీఆర్ ఆలోచనలకు అనుగుణంగా నగరాలకు, పట్టణాలకు దగ్గర్లో ఉండే రిజర్వ్ ఫారెస్ట్ ప్రాంతాల్లో అర్బన్ లంగ్ స్పేస్లుగా అర్భన్ ఫారెస్ట్ పార్క్ లను అటవీ శాఖ,హెచ్ఎండిఏ కలిసి వీటిని అభివృద్ధి చేస్తున్నారు. మానసికోల్లాసంతో పాటు ఆహ్లాద కరమైన వాతావరణం అందించేందుకు హైదరాబాద్కు నలువైపులా వీటిని ఏర్పాటు చేస్తున్నామని అటవీశాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు. ఒత్తిడిని అధిగమించేందుకు, యాంత్రిక జీవనం నుంచి కొద్దిసేపు ఆటవిడుపుగా గడిపేందుకు, స్వచ్చమైన ప్రాణవాయువును అందించేందుకు అర్బన్ ఫారెస్ట్ పార్క్లు దోహదం చేస్తాయని ఆయన తెలిపారు.
గాజులరామారం రిజర్వ్ ఫారెస్ట్ బ్లాక్ లోని 454 ఎకరాల విస్తీర్ణంలో రూ. 11.37 కోట్ల అంచనా వ్యయంతో ప్రాణవాయువు అర్బన్ ఫారెస్ట్ పార్క్ ను సర్వంగా సుందరంగా తీర్చిదిద్దారు. ఎటు చూసినా పచ్చదనం కనిపించేలా పెద్ద ఎత్తున మొక్కలను నాటారు. సందర్శకులను అకట్టుకునేలా యోగా షేడ్, వాకింగ్, సైక్లింగ్ ట్రాక్, గజీబో, ఆటవిడుపు కోసం చిన్న పిల్లలకు ప్రత్యేక ఆట స్థలం, కుంటుంబంతో హాయిగా సేదతీరేలా పిక్నిక్ ఏరియా, నేచురల్ రాక్ సిట్టింగ్, తదితర సౌకర్యాలను కల్పించారు. సందర్శకులకు వినోదంతో పాటు విజ్ఞానం అందించేలా పర్యావరణ పరిరక్షణ, అడవుల ప్రాధన్యత గురించి అవగాహన కల్పించేందుకు ప్రత్యేకంగా ఒపెన్ క్లాస్ రూంలను ఏర్పాటు చేశారు.