యూఏఈలో మళ్లీ పెరిగిన కొత్త కేసులు
ABN , First Publish Date - 2020-07-04T16:35:27+05:30 IST
గత కొన్ని రోజులుగా యూఏఈలో తగ్గుతూ వచ్చిన కరోనా కొత్త కేసులు శుక్రవారం మళ్లీ పెరిగాయి.
యూఏఈ: గత కొన్ని రోజులుగా యూఏఈలో తగ్గుతూ వచ్చిన కరోనా కొత్త కేసులు శుక్రవారం మళ్లీ పెరిగాయి. నిన్న ఒకేరోజు 672 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా... 489 మంది కోలుకుని ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. దీంతో ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా ఈ వైరస్ బారిన పడ్డవారు 50,141 మంది అయితే... మొత్తం కోలుకున్న వారు 39,153 మంది అయినట్లు ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు. ఇక ఇప్పటికే యూఏఈ వ్యాప్తంగా 318 మందిని ఈ మహమ్మారి పొట్టనబెట్టుకుంది. మరో 10,670 మంది దేశంలోని వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
మరోవైపు కరోనా వ్యాప్తి నియంత్రణకు యూఏఈ ముమ్మరంగా కోవిడ్ టెస్టులు చేస్తోంది. అలాగే బయటకు వచ్చేవారికి ముఖానికి మాస్కు ధరించడంతో పాటు సామాజిక దూరం పాటించడం, తరచూ చేతులు శుభ్రం చేసుకోవడం వంటి ముందు జాగ్రత్త చర్యలు సూచిస్తోంది. ఈ ముందు జాగ్రత్త చర్యలను ఉల్లంఘించిన వారి పట్ల అధికారులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. గతవారం ఇలా ముందు జాగ్రత్త చర్యలను ఉల్లంఘించిన వ్యక్తుల పేర్లు మరియు ఫోటోలను యూఏఈ పబ్లిక్ ప్రాసిక్యూషన్ ప్రచురించింది. అలాగే ఉల్లంఘనలకు పాల్పడిన వారికి యూఏఈ అధికారులు 2వేల దిర్హామ్స్ నుంచి 10వేల దిర్హామ్స్ వరకు జరిమానా కూడా విధిస్తున్నారు.