నటి అమలాపాల్‌కు UAE బంపర్ ఆఫర్.. ఉపాసనకు సైతం..

ABN , First Publish Date - 2021-12-30T16:05:27+05:30 IST

నటి అమలాపాల్‌కు అరుదైన గౌరవం దక్కింది. ఆమెకు యూఏఈ ప్రభుత్వం మంగళవారం గోల్డెన్ వీసా మంజూరు చేసింది.

నటి అమలాపాల్‌కు UAE బంపర్ ఆఫర్.. ఉపాసనకు సైతం..

దుబాయ్: నటి అమలాపాల్‌కు అరుదైన గౌరవం దక్కింది. ఆమెకు యూఏఈ ప్రభుత్వం మంగళవారం గోల్డెన్ వీసా మంజూరు చేసింది. పదేళ్ల కాలపరిమితితో అమలాపాల్‌కు యూఏఈ ఈ లాంగ్‌టర్మ్ రెసిడెన్సీ వీసాను జారీ చేసింది. నటుడు రాంచరణ్ సతీమణి ఉపాసన కూడా తాజాగా గోల్డెన్ వీసా అందుకున్నారు. కాగా, త్రిష తర్వాత గోల్డెన్ వీసా అందుకున్న రెండో తమిళ నటి అమలాపాల్. ఈ సందర్భంగా ఆమె సోషల్ మీడియా ద్వారా తన ఆనందాన్ని పంచుకున్నారు. "వారు బంగారం కోసం వెళ్ళు అని అంటున్నారు. నేను బంగారం కోసం వెళ్ళాను! ఈరోజు యూఏఈ గోల్డెన్ వీసా అందుకున్నాను. కచ్చితంగా ఇది అద్భుతమైన అనుభూతి. ఇది జరిగేలా చేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు.” అని ఆమె ఇన్‌స్టాగ్రామ్ వేదికగా తన ఆనందాన్ని అభిమానులతో పంచుకున్నారు. వీసా అందుకుంటున్న ఫొటోను ఈ ఇన్‌స్టా పోస్టుకు ఆమె జత చేశారు. ఇక సంచలనాలకు, వివాదాలకు కేరాఫ్‌ అడ్రస్‌ ఈ అమ్మడు. దర్శకుడు విజయ్‌తో విడాకుల తర్వాత మళ్లీ మూవీస్‌లో రీఎంట్రీ ఇచ్చారామె. అయితే, ఇటీవల అమలాకు సినిమా అవకాశాలు తగ్గడంతో వెబ్‌ సిరీస్‌లతో కెరీర్‌ను నెట్టుకొస్తున్నారు. 


ఇదిలాఉంటే.. భారత్ నుంచి ఇప్పటివరకు వివిధ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు యూఏఈ ఇచ్చే ఈ గోల్డెన్ వీసాను అందుకున్న సంగతి తెలిసిందే. వీరిలో బాలీవుడ్‌కు చెందిన షారూక్ ఖాన్, సంజయ్‌దత్, సునీల్ షెట్టి, బోనీ కపూర్ ఫ్యామిలీ, సంజయ్ కపూర్, ఊర్వశి రౌతేలా, ఫరా ఖాన్ కుందన్, సోను నిగమ్, వరుణ్ ధావన్‌ ఉన్నారు. అలాగే మలయాళం నుంచి మోహన్‌లాల్, మమ్ముటీ, పృథ్వీరాజ్ సుకుమారన్, టొవినో థామస్, దుల్కర్ సల్మాన్ ఉన్నారు. వీరితో పాటు నటి త్రిషా, సీనియర్ గాయని కేఎస్ చిత్ర, క్రీడాకారిణి సానియా మీర్జా కూడా యూఏఈ ప్రభుత్వం నుంచి గోల్డెన్ వీసా అందుకున్నారు. అలాగే కొణిదేల వారి కోడలు, నటుడు రాంచరణ్ సతీమణి ఉపాసన సైతం తాజాగా గోల్డెన్ వీసా అందుకున్న విషయం తెలిసిందే.  



Updated Date - 2021-12-30T16:05:27+05:30 IST