తుంగభద్ర పుష్కరాలను కేసీఆర్ పట్టించుకోవట్లేదు: బండి సంజయ్
ABN , First Publish Date - 2020-10-31T01:18:55+05:30 IST
తుంగభద్ర పుష్కరాలను సీఎం కేసీఆర్ పట్టించుకోవట్లేదని, 5వ శక్తి పీఠంపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని బీజేపీ నేత బండి సంజయ్ మండిపడ్డారు.
గద్వాల: తుంగభద్ర పుష్కరాలను సీఎం కేసీఆర్ పట్టించుకోవట్లేదని, 5వ శక్తి పీఠంపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని బీజేపీ నేత బండి సంజయ్ మండిపడ్డారు. కేసీఆర్ ఏ ఆలయానికి వెళ్లినా వేల కోట్లు.. వంద కోట్లు అంటారు... కానీ ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టరని ఆగ్రహం వ్యక్తం చేశారు. సోయిలేకుండా ఫామ్హౌస్, ప్రగతిభవన్లో ఉంటే పనులు జరగవని, కేసీఆర్ మంత్రులు అపాయింట్మెంట్ కూడా ఇవ్వరని బండి సంజయ్ ఆరోపించారు.
తుంగభద్ర పుష్కరాల ఏర్పాట్లపై ఈసారి సందిగ్ధత నెలకొంది. పుష్కరాల్లో భక్తులు నదీ పరివాహక ప్రాంతానికి చేరుకుని స్నానాలు చేస్తారు. పితృ దేవతలకు పిండ ప్రదానాలు చేస్తారు. దీని కోసం ప్రభుత్వం నదీ తీరంలో స్నాన ఘట్టాలను ఏర్పాటు చేయాలి. ప్రజారవాణా తదితర సౌకర్యాలు కల్పించాలి. కానీ కరోనా కారణమో.. మరే కారణమోగానీ తుంగభద్ర పుష్కరాలపై రాష్ట్ర ప్రభుత్వం ఓ స్పష్టమైన నిర్ణయం తీసుకోలేదు. కర్ణాటక ఎగువ భాగం నుంచి ప్రవహించే తుంగ, భద్ర నదుల సంగమమే తుంగభద్ర నది. ఏపీలోని కౌతాళం మండలం, మేళగనూరు వద్ద కర్నూలు జిల్లాలో ఈ నది ప్రవేశిస్తోంది. కౌతాళం, నందవరం, సి.బెళగల్, కోసిగి, మంత్రాలయం, గూడూరు మండలాలతో పాటు కర్నూలు పట్టణం గుండా ప్రవహించే ఈ నదికి 107 కిలోమీటర్ల మేర తీర ప్రాంతం ఉంది.