నేడు మెదక్‌-కాచిగూడ ప్యాసింజర్‌ రైలు షురూ

ABN , First Publish Date - 2022-09-23T08:06:53+05:30 IST

నేడు మెదక్‌-కాచిగూడ ప్యాసింజర్‌ రైలు షురూ

నేడు మెదక్‌-కాచిగూడ ప్యాసింజర్‌ రైలు షురూ

 ప్రారంభించనున్న కేంద్ర, రాష్ట్ర మంత్రులు


మెదక్‌, సెప్టెంబరు 22: మెదక్‌ ప్రాంత ప్రజల దశాబ్దాల కల ఎట్టకేలకు నెరవేరుతోంది. మెదక్‌ రైల్వేస్టేషన్‌ నుంచి కాచిగూడ వరకు రైలు పరుగులు పెట్టనుంది. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి శుక్రవారం సాయంత్రం 4 గంటలకు జెండా ఊపి ఈ ప్యాసింజర్‌ రైలును ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర మంత్రి హరీశ్‌రావు, ఎమ్మెల్యే పద్మా దేవేందర్‌రెడ్డి, మెదక్‌ జడ్పీ చైర్‌పర్సన్‌ హేమలత, ఎమ్మెల్సీ శేరి సుభా్‌షరెడ్డి, మునిసిపల్‌ చైర్మన్‌ చంద్రపాల్‌ హాజరుకానున్నట్లు దక్షిణమధ్య రైల్వే అధికారులు తెలిపారు. మెదక్‌కు రైలు మార్గం కోసం 2003లో రైల్వే సాధన సమితి పేరిట స్థానిక ప్రజలు ఉద్యమాన్ని ప్రారంభించారు. ఈ క్రమంలో 2012-13 రైల్వే బడ్జెల్‌లో కాస్ట్‌ షేరింగ్‌ పద్ధతిలో రామాయంపేట మండలం అక్కన్నపేట నుంచి మెదక్‌ వరకు బ్రాడ్‌ గేజ్‌ రైల్వేలైన్‌ మంజూరైంది. అనంతరం కేంద్ర ప్రభుత్వ వాటా నిధులన్నీ మంజూరవగా.. రాష్ట్ర ప్రభుత్వ నిధులు పెండింగ్‌లో ఉండడంతో పనులు నత్తనడకన సాగాయి. గత డిసెంబరులో రూ.20 కోట్లు మంజూరవడంతో ఆ మేరకు పనులు జరిగాయి. మెదక్‌ రైల్వే స్టేషన్‌ను ఆధునిక సౌకర్యాలతో నిర్మించారు. ఈ స్టేషన్‌ నుంచి నిత్యం తెల్లవారుజామున 5 గంటలకు కాచిగూడ ప్యాసింజర్‌ రైలు బయలుదేరుతుంది. మెదక్‌ రైల్వే స్టేషన్‌ ప్రారంభం సందర్భంగా ఉద్యమంలో పాల్గొన్న ప్రజలంతా ఉదయం 11 గంటలకు విజయోత్సవ ర్యాలీలో పాల్గొనాలని రైల్వే సాధన సమితి ఓ ప్రకటనలో పిలుపునిచ్చింది.

Updated Date - 2022-09-23T08:06:53+05:30 IST