నవీనను హతమార్చింది ఇలా..
ABN , First Publish Date - 2022-09-23T08:04:50+05:30 IST
నవీనను హతమార్చింది ఇలా..
ఆస్పత్రి సీసీ ఫుటేజీని బయటపెట్టిన పోలీసులు
సంచలనమైన ‘ఆంధ్రజ్యోతి’ కథనం
ఖమ్మం, సెప్టెంబరు 22 (ఆంధ్రజ్యోతిప్రతినిధి): నవీన హత్య రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ‘భార్యను చంపి.. ఆస్పత్రిపై నెట్టి..’ శీర్షికన గురువారం ‘ఆంధ్రజ్యోతి’లో ప్రచురితమైన వార్త సర్వత్రా చర్చనీయాంశమైంది. 50 రోజుల క్రితం జరిగిన ఈ సంఘటనను పోలీసులు గోప్యంగా ఉంచడం పట్ల అనుమానాలు వ్యక్తమవుతుండగా.. గురువారం ఖమ్మం టూ టౌన్ పోలీసులు ఈ ఘటనకు సంబంధించిన సీసీ పుటేజీలను మీడియాకు వెల్లడించారు. జూలై 30న ప్రసవం నిమిత్తం.. భిక్షం తన రెండో భార్య నవీనను ఖమ్మంలోని శశిబాల ఆస్పత్రిలో చేర్చాడు. అదేరోజు వైద్యులు ఆమెకు ఆపరేషన్ చేయగా ఆడశిశువుకు జన్మనిచ్చింది. నవీనను హత్య చేయాలన్న పథకం ప్రకారం మత్తు ఇంజక్షన్లు భిక్షం తన వెంట తెచ్చుకున్నాడు. అర్ధరాత్రి 12:50గంటల తర్వాత తాను తెచ్చుకున్న మత్తు ఇంజక్షన్ను భార్యకు ఎక్కించే ప్రయత్నాలు మొదలు పెట్టాడు. నవీన చేతికి ఉన్న బీపీ కప్, పల్స్ఆక్సీమీటర్ను తొలిగించాడు. తర్వాత లైట్లు ఆపి భార్య నవీన మంచానికి కుడివైపున కింద పడుకున్నాడు. జూలై 31న తెల్లవారుజామున 4:18గంటలకు నవీన కుడిచేతికి ఉన్న ఐవీ క్యాన్యులా మూత తీసి రెండుసార్లు మత్తు ఇంజక్షన్ ఇచ్చాడు. ఉదయం 6:45గంటలకు ఆక్సిమీటర్ను చేతికి పెట్టి నవీన చనిపోయిందని నిర్ధారించుకుని కాంపౌండర్ను పిలిచాడు. కాంపౌండర్ వచ్చి డ్యూటీ డాక్టర్కు సమాచారం ఇవ్వగా ఆమె వచ్చి సీనియర్ డాక్టర్ను పిలిచారు. ఆమె వచ్చి పరీక్షించి నవీన చనిపోయినట్టు నిర్ధారించారు.