ట్రంప్ అధికార దుర్వినయోగం.. దర్యాప్తు ప్రారంభించిన న్యాయవిభాగం
ABN , First Publish Date - 2021-06-13T22:51:35+05:30 IST
అమెరికా అధ్యక్షునిగా డొనాల్డ్ ట్రంప్ చేసిన అక్రమాలపై దర్యాప్తును ప్రారంభించనున్నట్టు ఆ దేశ న్యాయవిభాగం శుక్రవారం తెలిపింది. వ్యక్తిగత కారణాలతో ట్రంప్ తన రాజకీయ ప్రత్యర్థులపై నిఘా ఉంచారని,
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షునిగా డొనాల్డ్ ట్రంప్ చేసిన అక్రమాలపై దర్యాప్తును ప్రారంభించనున్నట్టు ఆ దేశ న్యాయవిభాగం శుక్రవారం తెలిపింది. వ్యక్తిగత కారణాలతో ట్రంప్ తన రాజకీయ ప్రత్యర్థులపై నిఘా ఉంచారని, వారిని శిక్షించడానికి కూడా ఆయన వెనకాడలేదని పేర్కొంది. అధ్యక్ష ఎన్నికల్లో రష్యా సహకారం పొందారంటూ ఆయనపై ఆరోపణలు వచ్చాయి. ఈ విషయమై ఆరోపణలు చేసిన డెమొక్రాటిక్ పార్టీకి చెందిన చట్టసభ సభ్యులు ఆడం షిఫ్, ఎరిక్ స్వాల్వెల్ల ఐ-ఫోన్ల నుంచి ట్రంప్ రహస్యంగా సమాచారం సేకరించారు. ఇందుకు అప్పటి న్యాయవిభాగం అధికారులతో పాటు, ఆపిల్ కంపెనీ కూడా సహకరించింది. వారి కుటుంబ సభ్యుల స్మార్ట్ ఫోన్ల నుంచి సమాచారాన్ని కూడా అక్రమంగా సంపాదించారు. మరో 12 మంది నాయకుల ఫోన్ల వివరాలను కూడా ఆపిల్ కంపెనీ అందజేసింది. ఈ క్రమంలో వ్యక్తిగత అవసరాల కోసం అధికారాన్ని దుర్వినియోగం చేశారని విమర్శలు రావడంతో బైడెన్ ప్రభుత్వం దర్యాప్తు చేయిస్తోంది.