పక్కా ప్లాన్తోనే అలా చేశారు... బీజేపీపై బాల్కసుమన్ విమర్శలు
ABN , First Publish Date - 2022-03-08T19:40:04+05:30 IST
అసెంబ్లీలో జరిగిన ఘటనలు బాధాకరమని టీఆర్ఎస్ నేత బాల్కసుమన్ అన్నారు.
హైదరాబాద్: అసెంబ్లీలో జరిగిన ఘటనలు బాధాకరమని టీఆర్ఎస్ నేత బాల్కసుమన్ అన్నారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ...బడ్జెట్ కోసం అన్ని వర్గాలు ఆశగా ఎదురు చూశాయని తెలిపారు. సభలో బడ్జెట్ ప్రవేశ పెడుతుంటే బీజేపీ ఎమ్మెల్యేలు అరుపులతో అడ్డగోలుగా ప్రవర్తించారని మండిపడ్డారు. బీజేపీ ఎమ్మెల్యేలు సభా హక్కులు దుర్వినియోగం చేశారని.. దాంతో వారిని సస్పెండ్ చేయాల్సి వచ్చిందని వివరించారు. పక్కా ప్లాన్తోనే వారు అలా చేశారని ఆరోపించారు. గతంలో రాజ్యసభలో 12 మంది సభ్యులను సస్పెండ్ చేశారని ఆయన గుర్తుచేశారు. మొన్న ఫిబ్రవరిలో హిమాచల్ ప్రదేశ్లో ఐదుగురు ఎమ్మెల్యేలను సస్పెండ్ చేశారన్నారు.
కర్ణాటక, మహారాష్ట్రతో పాటు చాలా రాష్ట్రాల్లో బీజేపీ ప్రభుత్వం సస్పెండ్ చేసిందని చెప్పుకొచ్చారు. వెల్లోకి వెళితే సస్పెండ్ చేయాలని గత బీఏసీలో తీర్మానం చేసినట్లు తెలిపారు. రాజా సింగ్ వెల్లోకి స్పీకర్ మీదకు వెళ్ళారని... ప్రభుత్వాన్ని బద్నాం చేసే చిల్లర ఎత్తుగడ వేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ నేతలకు దమ్ముంటే విభజన హామీల కోసం మోదీ దగ్గర కూర్చోవాలని హితవుపలికారు. ‘‘మీరు పోరాటం చేయాల్సింది ఢిల్లీలో ఇక్కడ కాదు.. బడ్జెట్ వినే వోపిక కూడా కాంగ్రెస్కు లేదా’’ అని బాల్క సుమన్ ప్రశ్నించారు.