క్లిష్టమైన ఏపీఐల తయారీ దిశగా..
ABN , First Publish Date - 2020-09-15T05:55:03+05:30 IST
దేశీయ ముడి ఔషధాల పరిశ్ర మ పురోగమిస్తోంది. చిన్నచిన్న యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇన్గ్రిడియెంట్ (ఏపీఐ
పురోగమిస్తున్న దేశీయ ఫార్మా పరిశ్రమ
1.5 లక్షల కోట్ల డాలర్లకు ప్రపంచ అమ్మకాలు
దివీస్ లాబ్స్ చైర్మన్ రమేశ్ నిమ్మగడ్డ
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): దేశీయ ముడి ఔషధాల పరిశ్ర మ పురోగమిస్తోంది. చిన్నచిన్న యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇన్గ్రిడియెంట్ (ఏపీఐ) మాలిక్యూల్స్ను తయారు చేసే స్థాయి నుంచి అత్యంత విలు వైన, కాంప్లెక్స్ ఏపీఐల తయారీకి భారత్ ప్రాధాన్య గమ్యస్థానంగా మారుతోందని దివీస్ లేబొరేటరీస్ చైర్మన్ రమేశ్ నిమ్మగడ్డ అన్నారు. భారీ స్థాయిలో కెమిస్టులు, టెక్నాలజీస్టుల లభ్యత, ప్రపంచస్థాయి ప్రమా ణాల తయారీ యూనిట్లు, తక్కువ ఉత్పత్తి వ్యయం తదితర సానుకూల అంశాలు ప్రపంచంలోనే భారత పరిశ్రమను మూడో స్థానంలో ఉంచా యని వార్షిక సర్వసభ్య సమావేశంలో ఆయన పేర్కొన్నారు.
ఏపీఐలు వాటి తయారీకి వినియోగించే కీ స్టార్టింగ్ మెటీరియల్స్ (కేఎస్ఎం) దిగుమతులపై ఆధారపడడాన్ని తగ్గించుకోవాలని ప్రభుత్వం భావిస్తోం దని, దేశంలో ప్రధాన ఏపీఐ తయారీ కంపెనీగా ప్రభుత్వ కృషికి మద్దతుగా ఉంటామని రమేశ్ అన్నారు.
33 శాతం వృద్ధి: ప్రపంచవ్యాప్తంగా ఔషధాలపై ఖర్చు చేసే మొత్తం 2021 నాటికి 1.5 లక్షల కోట్ల డాలర్లకు చేరగలదని క్విన్టైల్స్ ఇనిస్టిట్యూట్ పరిశోధన అంచనా వేసిందని, 2016 నాటి మార్కెట్తో పోలిస్తే ఇది 33 శాతం అధికమని రమేశ్ అన్నారు. వృద్ధులు, జనాభా, ఆదాయాలు పెరగడం, నాణ్యమైన ఆరోగ్య సంరక్షణ సౌకర్యాలు పెరగడంతో పాటు అందుబాటులోకి రావడం వంటి అంశాలు ప్రపంచ ఔషధ పరిశ్రమ వృద్ధికి దోహదం చేస్తున్నాయని తెలిపారు.
ఏపీఐలు, ఇంటర్మీడియెట్లకు భారత్ ప్రత్యామ్నాయ గమ్యస్థానంగా రూపొందేందుకు భారత ఫార్మా స్యూటికల్ పరిశ్రమకు కొవిడ్ ఒక మంచి అవకాశాన్ని కల్పించిందని రమేశ్ చెప్పారు.
హైడ్రాక్సిక్లోరోక్విన్, ఫావిపిరావిర్ తయారీకి: దేశీయంగా లభ్యమ య్యే ముడి ఔషధాల ద్వారా కొవిడ్-19 చికిత్సకు వినియోగిస్తున్న హైడ్రాక్సిక్లోరోక్విన్, ఫావిపిరావిర్ తయారు చేసే ప్రక్రియను దివీస్ లేబొ రేటరీస్ అభివృద్ధి చేసిందని దివీస్ మేనేజింగ్ డైరెక్టర్ మురళీ కే దివీ తెలిపారు. రెమ్డెసివిర్ తయారీ కోసం నాలుగు క్లిష్టమైన ఇంటర్మీడియెట్ల తయారీ ప్రాసెస్ను కూడా అభివృద్ధి చేసినట్లు చెప్పారు.
ప్రతి సవాలును ఒక అవకాశంగా కంపెనీ మార్చుకుంటోందని, అత్యంత నాణ్యమైన జన రిక్ ఏపీఐల సరఫరాదారుగా గుర్తింపు పొందిందన్నారు. కాగా తెలంగాణ చౌటుప్పల్లోని డీసీ-సెజ్, ఏపీలోని చిప్పాడలో డీసీవీ-సెజ్ యూనిట్లు గత ఆర్థిక సంవత్సరంలో వాణిజ్య ఉత్పత్తిని ప్రారంభించాయని చెప్పారు.