అన్ని విధాలుగా ఆలోచించిన తర్వాతే.. ఇలా నిర్ణయించాం..!
ABN , First Publish Date - 2021-10-27T13:13:34+05:30 IST
అన్ని విధాలుగా ఆలోచించిన తర్వాతే..
అన్నీ ఆలోచించాకే 8లక్షల ఆదాయ పరిమితి
ఈడబ్యూఎస్ రిజర్వేషన్లపై సుప్రీంలో కేంద్రం అఫిడవిట్
న్యూఢిల్లీ: అన్ని విధాలుగా ఆలోచించిన తర్వాతే మెడికల్ ఆలిండియా కోటాలో ఈడబ్ల్యూఎస్, ఓబీసీ రిజర్వేషన్లను అమలు చేయాలని నిర్ణయించినట్టు సుప్రీం కోర్టుకు కేంద్రం తెలిపింది. ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి రూ.8లక్షల వార్షిక ఆదాయ పరిమితిని నిర్దేశించడం ఏకపక్ష నిర్ణయం కాదని పేర్కొంది. కేంద్ర సామాజిక న్యాయ మంత్రిత్వ శాఖలో ఈ అంశంపై చర్చలు జరిగాయని తెలిపింది. సంబంధిత వర్గాల ప్రజలందరినీ సంప్రదించిన తర్వాత నిబంధనలను రూపొందించినట్టు స్పష్టం చేసింది.
మెడికల్ కోర్సుల్లో ఆలిండియా కోటాలో ఈడబ్ల్యూఎస్, ఓబీసీ రిజర్వేషన్లను సవాలు చేస్తూ సుప్రీం కోర్టులో వ్యాజ్యం దాఖలైన సంగతి తెలిసిందే. దీనిపై విచారణ సందర్భంగా.. ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి రూ.8లక్షల ఆదాయ పరిమితి పెట్టడానికి ప్రాతిపదిక ఏమిటో వెల్లడించాలని కేంద్రాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ మేరకు కేంద్రం సుప్రీంలో మంగళవారం అఫిడవిట్ దాఖలు చేసింది. ఆదాయ పరిమితి విషయంలో గతంలో కేంద్రం నియమించిన సిన్హో కమిషన్ సిఫారసులను కూడా పరిగణనలోకి తీసుకున్నట్టు కేంద్రం అఫిడవిట్లో పేర్కొంది. నగరాలు, గ్రామీణ ప్రాంతాలకు ఒకే ఆదాయ పరిమితిని నిర్ణయించడంపై సుప్రీంకోర్టు లేవనెత్తిన ప్రశ్నలకు కూడా కేంద్రం అఫిడవిట్లో సమాధానం ఇచ్చింది.