నేడే Eluru కార్పొరేషన్ ఎన్నికల ఓట్ల లెక్కింపు
ABN , First Publish Date - 2021-07-25T12:38:46+05:30 IST
ఏలూరు నగరపాలక సంస్థ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు సీఆర్ రెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో..
ఏలూరు : ఏలూరు నగరపాలక సంస్థ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు సీఆర్ రెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో ఏర్పాట్లు పూర్తయ్యాయి. నగరంలోని 50 డివిజన్లకు మూడు ఏకగ్రీవమవడంతో మిగిలిన 47 డివిజన్లకు ఎన్నికలు జరిగాయి. ఆదివారం ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. కళాశాలలో నాలుగు హాల్స్ ఏర్పాటు చేసి వీటిలో 47 టేబుల్స్ ఏర్పాటు చేశారు. ఒకొక్క టేబుల్లో ఒక్కొ డివిజన్ ఓట్లను లెక్కిస్తారు. లెక్కింపు కోసం 64 మంది సూపర్ వైజర్లను, కౌంటింగ్ అసిస్టెం ట్లను 250 మందిని ఏర్పాటు చేశారు. వీరుగాక 500 మంది మున్సిపల్ సిబ్బంది పాల్గొంటున్నారు. రిటర్నింగ్ ఆఫీసర్లు 16 మంది, రిజర్వుడులో ముగ్గురిని ఉంచారు. అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్లను కూడా 13 మందిని ఏర్పాటు చేసి మరో ముగ్గురిని రిజర్వులో ఉంచారు. కౌంటింగ్లో పాల్గొనే సిబ్బందికి పూర్తి స్థాయి శిక్షణ ఇచ్చారు. ఆర్వోలు, ఏఆర్వో లకు శనివారం అవగాహన నిర్వహించారు. కౌంటింగ్లో పాల్గొనే సిబ్బందికి కరోనా టెస్టులు నిర్వహించారు.
పోటీ చేసిన అభ్యర్థితో పాటు మరో ఇద్దరిని మాత్రమే కౌంటింగ్ హాలులోకి అనుమతిస్తారు. అభ్యర్థులు అందజేసిన పేర్లు ఉన్నవారిని మాత్రమే లోపలికి అనుమతిస్తారు. సెల్ ఫోన్లను అనుమతించరు. కౌంటింగ్ హాల్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. కౌంటింగ్ ప్రారంభం అయిన దగ్గర నుంచి విజేతలను ప్రకటించే వరకు వీడియో కెమెరా ద్వారా పరిశీలిస్తారు. ఏర్పాట్లను పోలీసు అధికారులు, నగర పాలక సంస్థ కమిషనర్ చంద్రశేఖర్ పరిశీలించారు. లెక్కింపు కోసం పటిష్టమైన ఏర్పాట్లు చేసినట్టు కమిషనర్ తెలిపారు. సిబ్బందికి అల్పాహారం, భోజన ఇతర సదుపాయాలు ఏర్పాట్లు చేశామన్నారు.