బతుకు ‘బండి’ లాక్..డౌన్
ABN , First Publish Date - 2020-04-03T09:16:52+05:30 IST
బతుకు ‘బండి’ లాక్..డౌన్
తిరుపతిలో కంపెనీ మూతతో బైకుపై కృష్ణాజిల్లాకు పయనం
లాక్డౌన్ ఉల్లంఘించారంటూ బాపట్లలో సీజ్ చేసిన పోలీస్
మనస్తాపంతో చెట్టుకు ఉరేసుకుని యువకుడి బలవన్మరణం
బాపట్ల టౌన్, మండవల్లి, ఏప్రిల్ 2: తిరుపతిలో పని చేసుకొనే శ్రీనివాసరావు కడుపు మీద కొట్టింది కరోనా. కృష్ణా జిల్లా మండవల్లి మండల పుట్లచెరువుకు చెందిన పేటాడ శ్రీనివాసరావు(22) చిత్తూరు జిల్లా తిరుపతిలో టీషర్టుల తయారీ కంపెనీలో పనిచేస్తున్నారు. లాక్డౌన్తో కంపెనీ మూసివేయడంతో ద్విచక్రవాహనంపై సగ్రామానికి బయలుదే రారు. మార్గమధ్యంలో గుంటూరు జిల్లా బాపట్ల మండలం స్టూవర్టుపురంలోని వెదుళ్లపల్లి చెక్ పోస్ట్ వద్ద పోలీసులు శ్రీనివాసరావును ఆపారు. ఆయన ప్రయాణిస్తున్న బైకు చెన్సై రిజిస్ర్టేషన్ది కావటం, కరోనా లాక్డౌన్ నిబంధనలు అతిక్రమించి మూడు జిల్లాల సరిహద్దులు దాటి రావటంపై పోలీసులు ప్రశ్నించారు. కేసు నమోదు చేసి ద్విచక్రవాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. లాక్డౌన్ అనంతరం బైక్ను అందజేస్తామని చెప్పారు. దీంతో శ్రీనివాసరావు కాలినడకన అక్కడినుంచి బాపట్ల బస్స్టాండ్కు చేరుకొన్నారు. స్వగ్రామానికి వె ళ్లేందుకు మార్గం కనిపించకపోవడంతో మనస్థాపంతో ఆత్మహత్య చేసుకున్నారు. ఈ విషయాన్ని సెల్ఫీ వీడియోలో ఆయన బంధువులకు తెలియజేశారు. అయితే, శ్రీనివాసరావుకు కౌన్సెలింగ్ ఇచ్చి రాత్రి సమయంలో వ్యక్తిగత పూచికత్తుపై నోటీసు ఇచ్చి వదిలిపెట్టామని పోలీసువర్గాలు తెలిపాయి. ‘‘సంఘటన వివరాలు దర్యాప్తు తరువాతే తెలుస్తాయి. ఆర్థిక ఇబ్బందులే ఆత్మహత్యకు కారణమని శ్రీనివాసరావు బంధువులు చెబుతున్నారు’’ అని బాపట్ల పట్టణ సీఐ బీ అశోక్కుమార్ వివరణ ఇచ్చారు.