అమెరికా కాదు లండన్.. ట్రంప్‌ను నిరాశపరచాలని..

ABN , First Publish Date - 2020-08-04T00:51:12+05:30 IST

టిక్‌టాక్ మాతృసంస్థ బైట్‌డ్యాన్స్ తమ ప్రధాన కార్యాలయాన్ని బీజింగ్ నుంచి లండన్‌కు

అమెరికా కాదు లండన్.. ట్రంప్‌ను నిరాశపరచాలని..

లండన్: టిక్‌టాక్ మాతృసంస్థ బైట్‌డ్యాన్స్ తమ ప్రధాన కార్యాలయాన్ని బీజింగ్ నుంచి లండన్‌కు మార్చనున్నట్టు వార్తలొస్తున్నాయి. ఇప్పటికే దీనికి సంబంధించి బ్రిటిష్ మంత్రులతో ఒప్పందం కుదుర్చుకున్నట్టు లండన్‌కు చెందిన ఓ వార్తాపత్రిక ప్రకటించింది. టిక్‌టాక్‌ను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బ్యాన్ చేసేలా ఆర్డర్‌పై సంతకం చేస్తానంటూ గత శుక్రవారం తెలిపారు. టిక్‌టాక్ అమెరికన్ల డేటాను చైనా ప్రభుత్వానికి చేరవేస్తోందని గత కొంతకాలం నుంచి పలు ఆరోపణలు వస్తున్నాయి. అమెరికాకు చెందిన నిపుణులు సైతం టిక్‌టాక్ వల్ల దేశభద్రతకు ముప్పు వాటిల్లుతోందని.. వెంటనే ఆ యాప్‌ను బ్యాన్ చేయాలంటూ ట్రంప్‌కు సూచిస్తూ వచ్చారు. అయితే టిక్‌టాక్ అమెరికా ఆపరేషన్స్‌ను మైక్రోసాఫ్ట్ తీసుకోవాలని ప్రయత్నాలు చేస్తోంది. ట్రంప్ కూడా ఈ ఒప్పందానికి సుముఖంగా ఉన్నట్టు వైట్‌హౌస్ వర్గాలు చెబుతున్నాయి. అంతేకాకుండా మైక్రోసాఫ్ట్‌తో ఒప్పందం చేసుకునేందుకు టిక్‌టాక్‌కు 45 రోజుల సమయం ఇచ్చేందుకు కూడా ట్రంప్ అంగీకరించినట్టు వార్తలొచ్చాయి. మరోపక్క మైక్రోసాఫ్ట్ సంస్థ సెప్టెంబర్ 15లోపు బైట్‌డ్యాన్స్‌తో చర్చలు జరిపి ఒప్పందానికి సంబందించి ఒక నిర్ణయానికి వచ్చేలా లక్ష్యం పెట్టుకున్నట్టు తెలిపింది. ఇదే సమయంలో బైట్‌డ్యాన్స్ తమ కార్యాలయాన్ని లండన్‌కు మార్చనున్నట్టు వార్తలు రావడం ఆశ్చర్యం కలిగిస్తోంది. అయితే బైట్‌డ్యాన్స్ కేవలం ట్రంప్‌ను నిరాశ పరిచేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం.

Updated Date - 2020-08-04T00:51:12+05:30 IST