NRI news: ఎన్నారై మహిళకు బెదిరింపులు.. నీ కుమారుడి వీడియోలు బయటపెడతానంటూ..
ABN , First Publish Date - 2022-08-08T05:10:01+05:30 IST
ఎన్నారై మహిళను బ్లాక్మెయిల్ చేసి రూ. 6.5 కోట్లు దోచుకున్న ఆరోపణలపై ముంబై పోలీసులు ముగ్గురు వ్యక్తులను తాజాగా అరెస్టు చేశారు.
ఎన్నారై డెస్క్: ఎన్నారై మహిళను బ్లాక్మెయిల్ చేసి రూ. 6.5 కోట్లు దోచుకున్న ఆరోపణలపై ముంబై పోలీసులు ముగ్గురు వ్యక్తులను తాజాగా అరెస్టు చేశారు. తన కుమారుడిని డ్రగ్స్ కేసులో ఇరికించి జైలు పాలు చేస్తామంటూ నిందితులు తనను బెదిరించినట్టు ముంబైలోని దహిసార్ ప్రాంతానికి చెందిన ఓ ఎన్నారై మహిళ ఫిర్యాదు చేసింది. నిందితులు తన కుమారుడితో అసహజ శృంగారంలో పాల్గొని ఆ వీడియోలను సోషల్ మీడియాలో పెడతామని కూడా వారు బెదిరింపులకు దిగినట్టు ఆరోపించింది.
బాధితురాలి ఫిర్యాదు ప్రకారం.. ఆమె కుమారుడికి కొనేళ్ల క్రితం ఓ కోచింగ్ సెంటర్లో యశ్ ఛల్కే అనే తోటి విద్యార్థితో పరిచయమైంది. ఇక 2018లో ఓ డ్రగ్స్ కేసులో అరెస్టైన ఛల్కే ఆ తరువాత బెయిలుపై విడుదలయ్యాడు. అయితే..ఈ కేసులో ఎన్నారై మహిళ కుమారుడిని కూడా ఇరికిస్తామంటూ ఛల్కే అతడి ఇద్దరు స్నేహితులు ఆమెపై బెదిరింపులకు దిగారు. ఒకానోక సందర్భంగా ఆమె ఇంటికి కొందరు రాజకీయనాయకులను కూడా తీసుకొచ్చిన నిందితులు ఆ తరువాత.. వారి పేరు చెప్పి మరింతా బెదిరిస్తూ డబ్బులు దండుకున్నారు. ఆ తరువాత తాము వారికి డబ్బు ఇవ్వడం ఆపేయడంతో వారు మరో దారుణానికి ఒడిగట్టినట్టు ఎన్నారై మహిళ తన ఫిర్యాదులో పేర్కొంది. తన కుమారుడితో అసహజ శృంగారం నెరపారని వాపోయింది. అదంతా వీడియోలో రికార్డు చేశారని, వాటిని సోషల్ మీడియాలో పెడతామంటూ తమను బెదిరించారని పేర్కొంది.
ఇదిలా ఉంటే.. 2018 నాటి కేసులో బెయిల్ పొందేందుకు ఛల్కే ఎన్నారై కుటుంబం నుంచి రూ. 7 వేలు తీసుకున్నాడని కూడా పోలీసులు తెలిపారు. ఇక ఇటీవలే ఇండియా వచ్చిన తనను వారు మరోమారు బెదిరించారని, రూ.62 లక్షలు ఇవ్వమని డిమాండ్ చేశారని బాధితురాలు పేర్కొంది. వారి బెదిరింపులకు లొంగకపోవడంతో తనను వెంబడిస్తూ వేధించడం, గుర్తు తెలియని నెంబర్ల నుంచి ఫోన్ చేయడం వంటి చేష్టలకు పాల్పడ్డారని ఫిర్యాదు చేసింది. ఇక శుక్రవారం రాత్రి వారు ఎన్నారై మహిళ ఇంటి గేటు దూకి లోపలికి వచ్చేందుకు ప్రయత్నించడంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో.. వారు ఆ ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. బ్లాక్మెయిలింగ్ అసహజ శృంగారం తదితర సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.