Justice Kanagaraj కు జగన్ సర్కార్ మూడో పోస్టు..
ABN , First Publish Date - 2021-11-30T16:40:21+05:30 IST
Justice Kanagaraj కు జగన్ సర్కార్ మూడో పోస్టు..
- పీడీ కేసుల మండలిలో సభ్యుడిగా నియామకం
- చైర్మన్గా జస్టిస్ సంజీవరెడ్డి
- 84 ఏళ్ల వయసులో బాధ్యతలు
అమరావతి : జగన్ ప్రభుత్వం పీడీ కేసుల సలహా మండలిని ఏర్పాటు చేసింది. మండలి అధ్యక్షుడిగా రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ నీలం సంజీవరెడ్డి (84)ని నియమించింది. ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జడ్జిగా పని చేశారు. 1999లో రిటైర్ అయ్యారు. ఇక.. ఇదే కమిటీలో మరో ఇద్దరు సభ్యులుగా జస్టిస్ కనగరాజ్ (75), జస్టిస్ పి.దుర్గాప్రసాద్ (70)లకు చోటు కల్పించింది. సోమవారం నాడు ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ ఈ ఉత్తర్వులు జారీ చేశారు. నేరాలకు పాల్పడటం, శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వ్యక్తులపై పోలీసుల సిఫారసు మేరకు జిల్లాల కలెక్టర్లు పీడీ (ప్రివెంటివ్ డిటెన్షన్) యాక్టు అమలు చేస్తారు. ఆ కేసులను ముగ్గురు రిటైర్డ్ జడ్జిలతో కూడిన కమిటీ పరిశీలిస్తుంది. కమిటీ ఆమోదంతోనే పీడీ కేసులు నిలబడతాయి.
జస్టిస్ కనగరాజ్కు మూడో పోస్టు..
జస్టిస్ కనగరాజ్కు ఏపీలో దక్కిన మూడో పదవి ఇది. ఎస్ఈసీగా ఉన్న నిమ్మగడ్డ రమేశ్ కుమార్ను తప్పించిన జగన్ సర్కారు... అప్పటికప్పుడు తమిళనాడుకు చెందిన జస్టిస్ కనగరాజ్ను ఆ స్థానంలో నియమించింది. అయితే... ప్రభుత్వ నిర్ణయంపై నిమ్మగడ్డ న్యాయపోరాటం చేసి విజయం సాధించడంతో జస్టిస్ కనగరాజ్ పదవి పోయింది. ఆ తర్వాత ఆయనను ఈ ఏడాది జూన్లో ఏపీ పోలీస్ కంప్లైంట్ అథారిటీ చైర్మన్గా నియమించింది. ఆ పోస్టులో 65ఏళ్ల లోపు వయసున్న వారిని మాత్రమే నియమించాలి. కానీ... జస్టిస్ కనగరాజ్కు 78 ఏళ్లు. హైకోర్టు ఆయన నియామకాన్ని రద్దు చేసింది. ఇప్పుడు ఆయనను పీడీ కేసుల సలహా మండలి సభ్యుడిగా నియమించారు.