ఏపీలో రాజకీయాలే తప్ప అభివృద్ధి లేదు

ABN , First Publish Date - 2021-01-24T08:42:37+05:30 IST

ఏపీలో పవర్‌ గేమ్‌, కుల, మత రాజకీయాలు, గూండాయిజం తప్పితే అభివృద్ధి ఎక్కడా కనిపించడం లేదని బీజేపీ జాతీయ నాయకుడు రామ్‌మాధవ్‌ పేర్కొన్నారు.

ఏపీలో రాజకీయాలే తప్ప అభివృద్ధి లేదు

  • రాజ్యాంగ వ్యవస్థల విచ్ఛిన్నంతో 
  • ప్రజాస్వామ్యం బలహీనం
  • దేశంలోని అనేక ప్రాంతాల్లో ఎన్నికలు
  • కొవిడ్‌ సాకు సరైంది కాదు: రామ్‌మాధవ్‌


విశాఖపట్నం, జనవరి 23(ఆంధ్రజ్యోతి): ఏపీలో పవర్‌ గేమ్‌, కుల, మత రాజకీయాలు, గూండాయిజం తప్పితే అభివృద్ధి ఎక్కడా కనిపించడం లేదని బీజేపీ జాతీయ నాయకుడు రామ్‌మాధవ్‌ పేర్కొన్నారు. ‘బికాజ్‌ ఇండియా కమ్స్‌ ఫస్ట్‌’ పుస్తకాన్ని శనివారం ఆయన విశాఖలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా  మాట్లాడుతూ దేశంలోని అన్ని రాష్ట్రాలకు పెట్టుబడులు, పరిశ్రమలు వస్తున్నాయని, ఏపీలో మాత్రం వాటి సంఖ్య చాలా పరిమితంగా ఉందన్నారు. ఇక్కడ మూడు రాజధానుల వివాదం, ఆలయాల కూల్చివేతలు తప్పితే మరొకటి వినిపించడంలేదన్నారు. రాష్ట్ర ప్రజలు ఇచ్చిన భారీ మెజారిటీతో అధికార పార్టీ ప్రమాదకరంగా వ్యవహరిస్తోందన్నారు. ప్రభుత్వం అభివృద్ధి దిశగా ఆలోచించాలని సూచించారు. దేశంలోని అనేక ప్రాంతాల్లో ఎన్నికలు జరుగుతున్నాయని, కొవిడ్‌ కారణంగా స్థానిక ఎన్నికలు నిర్వహించలేమని ఏపీ ప్రభుత్వం చెప్పడం సరైంది కాదన్నారు. కోర్టులు ఇచ్చే తుది తీర్పునకు కట్టుబడి ఉండాల్సిందేనని చెప్పారు. రాజ్యాంగ వ్యవస్థలను విచ్ఛిన్నం చేస్తే ప్రజాస్వామ్యం బలహీనపడుతుందని ఆందోళన వ్యక్తంచేశారు. దేశంలో వ్యవసాయ రంగాన్ని కొంతమంది శాసిస్తున్నారని చెప్పారు. వారి నియంత్రణ నుంచి రైతులను తప్పించడానికే సంస్కరణలు తీసుకొచ్చామన్నారు. వాటికి సహకరించాలని, రైతులు ప్రభుత్వంతో చర్చలు జరపాలని కోరారు.

Updated Date - 2021-01-24T08:42:37+05:30 IST