వారిది అవగాహనా రాహిత్యం
ABN , First Publish Date - 2022-10-07T08:24:47+05:30 IST
వారిది అవగాహనా రాహిత్యం
కాణిపాకం అభిషేకం టికెట్ 700లే: దేవదాయ శాఖ
అమరావతి, అక్టోబరు 6(ఆంధ్రజ్యోతి): కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానంలో అభిషేకం టికెట్ ధరను ఏమాత్రం పెంచలేదని, ఇప్పటి వరకూ ఉన్న ధర రూ.700నే యథావిధిగా కొనసాగిస్తున్నట్లు దేవదాయ శాఖ కమిషనర్ హరిజవహర్లాల్ స్పష్టం చేశారు. దాతల సహాయ సహకారాలతో అత్యంత సుందరంగా పునర్నిర్మించిన ఆలయంలో స్వామివారి అభిషేకం భక్తులు అందరికీ అందుబాటులో ఉండాలని దేవస్థానం ధర్మకర్తల మండలి చైర్మన్, సభ్యులు చర్చించి నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. అభిషేకం టికెట్ ధర రూ.700 నుంచి రూ.5వేలకు పెండానికి ఆలయ అధికారులు విడుదల చేసిన అభిప్రాయ సేకరణ పత్రం తమ దృష్టికి వచ్చిందన్నారు. దీనిని ఆలయ అధికారుల అవగాహన రాహిత్యంగా పరిగణిస్తున్నామన్నారు. దీనిపై పూర్తిస్థాయిలో చర్చించి ఉపసంహరించుకునేలా ధర్మకర్తల మండలి నిర్ణయం తీసుకుందని చెప్పారు. ప్రభుత్వం, దేవదాయ శాఖ కమిషనర్ దృష్టికి తీసుకురాకుండా టికెట్ల ధరపెంపు విషయంలో నిర్ణయం తీసుకున్నవారిపై విచారణ జరిపి తగుచర్యలు తీసుకుంటామన్నారు.