ధర్మ దీపావళి

ABN , First Publish Date - 2020-11-13T05:30:00+05:30 IST

ప్రజ్ఞ, శీలం... ఇవి బౌద్ధానికి పునాదులు. ప్రజ్ఞకు ప్రతీక దీపం. దీపాన్ని జ్ఞానానికీ, ప్రజ్ఞకూ సంకేతంగా బౌద్ధం అభివర్ణించింది. బుద్ధుడు, అనేకమంది బౌద్ధ తాత్త్వికులు దీపాన్ని ఉపమానంగా చెబుతూ ఎన్నెన్నో ప్రబోధాలు చేశారు...

ధర్మ దీపావళి

ప్రజ్ఞ, శీలం... ఇవి బౌద్ధానికి పునాదులు. ప్రజ్ఞకు ప్రతీక దీపం. దీపాన్ని జ్ఞానానికీ, ప్రజ్ఞకూ సంకేతంగా బౌద్ధం అభివర్ణించింది. బుద్ధుడు, అనేకమంది బౌద్ధ తాత్త్వికులు దీపాన్ని ఉపమానంగా చెబుతూ ఎన్నెన్నో ప్రబోధాలు చేశారు. ‘మీకు మీరే దీపాలు కండి’ అన్నాడు బుద్ధుడు. ‘మనుషులు చీకటి నుంచి వెలుగులోకి, వెలుగు నుంచి వెలుగులోకి నడవాలి’ అంటుంది బౌద్ధం. ‘చీకటి నుంచి వెలుగులోకి నడవడం’ అంటే ‘అజ్ఞానం నుంచి జ్ఞానం వైపు పయనించడం’ అని అర్థం. ‘వెలుగు నుంచి వెలుగులోకి’ అంటే ‘విజ్ఞానం నుంచి శీలం వైపు పయనించడం’ అని అర్థం. ఇలా మనిషికి శీలం, విజ్ఞానం... ఈ రెండూ కలిసి ఉంటేనే పరిపూర్ణత.


దీనికి చిహ్నంగా క్రీస్తు పూర్వం ఆరో శతాబ్దంలోనే బౌద్ధంలో దీప పూజ మొదలయింది. బౌద్ధ స్తూపాల దగ్గర, బౌద్ధ ఆరామాల్లో వందలాది దీపాలు వెలిగించేవారు. బౌద్ధ ధర్మోపన్యాసాలు, దాన కార్యక్రమాలు జరిగే ప్రదేశాలను దీపాలతో నింపేవారు. తమ గ్రామానికి బుద్ధుడు భిక్షువులతో కలిసి వచ్చిన సందర్భాల్లో ఇంటింటా దీపాలను వెలిగించి, ఆహ్వానం పలికే సంప్రదాయం బలీయంగా సాగింది. బౌద్ధ పర్వదినాలలో, ‘ఉపోసథ’ (బౌద్ధ భిక్షువులు సమావేశాలు నిర్వహించుకొనే) దినాల్లో బౌద్ధ స్తూపాల మీద వేలాది దీపాలు వెలిగించేవారు. ఈ స్థూపాలు దీపాల దిబ్బలుగా, దీపాల కొండలుగా కనిపించేవి. అందుకే వీటిని ‘దీపాల దిన్నెలు’ అంటారు. ప్రతి నెలలో పున్నమి రోజు, శుక్ల అష్టమి, బహుళ అష్టమి, బహుళ చతుర్దశి (అమావాస్య ముందురోజు) బౌద్ధులకు ఉపోసథ దినాలు.


ప్రతి ఆషాఢ మాసంలో బౌద్ధ భిక్షువులకు వర్షావాసం ప్రారంభమవుతుంది. ఆ కాలంలో మూడు నెలల పాటు భిక్షువులు ప్రజల వద్దకు భిక్ష కోసం వెళ్ళరు. అడవుల్లో, గుహల్లో ఉండి... దొరికింది తింటూ, ధ్యానంలో, విద్యలో ప్రత్యేక స్వయం శిక్షణ సాగిస్తారు. ఇలా వర్షావాసం పూర్తి చేసి, ఆశ్వయుజ మాసంలో తిరిగి గ్రామాలకు బయలుదేరుతారు.  గ్రామాలకు వచ్చే భిక్షువులకు దారి పొడవునా దీపాలతో ప్రజలు స్వాగతం పలుకుతారు. అదే ‘దీపావళి’గా, బౌద్ధుల ‘ధర్మ దీపావళి’గా ప్రసిద్ధం.


బౌద్థులు మరణాన్ని ‘నిర్వాణం’ అంటారు. ‘నిర్వాణం’ అంటే దీపం ఆరిపోవడం. ప్రమిదలోని నూనె, వత్తీ పూర్తిగా మండిన తరువాత ఇక దీపం వెలుగదు. అదే నూనె, అదే వత్తి ఇక ఉండవు. అంటే... అదే దీపాన్ని ఇక ఎప్పటికీ వెలిగించలేం. మనిషి నిర్వాణం తరువాత కూడా అంతే! ఇలా అనిత్యత్వాన్నీ, అనాత్మవాదాన్నీ దీపంతో పోల్చి చెబుతుంది బౌద్ధం. మరణించిన వ్యక్తి తల దగ్గర దీపం ఉంచే సంప్రదాయం బౌద్ధ భిక్షువుల నిర్వాణం నుంచి పుట్టినదే! స్తూపాల మీద దీపాలు ఉంచే ఆచారం కూడా దాన్నుంచి వచ్చిందే! అందుకే మరణాన్ని దీపం ఆరడంతో పోలుస్తాం. ‘నీ దీపం ఆరిపోను’ అనే తెలుగు నానుడి బౌద్ధ సంప్రదాయానికి ప్రతీకే!

ఈ రోజుకు ఉన్న మరో విశిష్టత ఏమిటంటే... ఇల్లు వదలి వచ్చిన సిద్ధార్థుడు ఆరేళ్ళు కృషి చేసి, చివరకు జ్ఞానోదయం పొంది బుద్ధుడయ్యాడు. సారనాథ్‌లో మొదటి వర్షావాసం ముగించి రాజగృహకు వచ్చాడు. ఆ సమయంలో... బుద్ధుడైన తన బిడ్డను కపిలవస్తు నగరానికి తీసుకురావాలని మంత్రుల్ని ఆయన తండ్రి శుద్ధోధనుడు ఆదేశిస్తాడు. చివరకు సిద్ధార్థుడి బాల్య మిత్రుడైన కాలు ఉదాయిని పంపుతాడు. కాలు ఉదాయి బుద్దుణ్ణి వెంటబెట్టుకొని కపిలవస్తుకు వస్తాడు. ఆ సందర్బంలో బుద్ధునికి శుద్ధోదనుడు దారిపొడవునా దీపాలు వెలిగించి స్వాగతం పలికాడు. ఆ రోజు రాజ్యమంతటా దీపాలు వెలిగించారు. అలా బుద్ధుడి కపిలవస్తు నగర పునరాగమనానికి సంకేతంగా దీపాలవెల్లి బౌద్ధ సంప్రదాయంగా నిలిచిపోయింది.

- బొర్రా గోవర్ధన్‌

Updated Date - 2020-11-13T05:30:00+05:30 IST