టీడీపీకి స్థలం కేటాయింపుపై విచారణ జరపండి

ABN , First Publish Date - 2021-04-16T10:25:56+05:30 IST

కార్యాలయం నిర్మాణానికి గత ప్రభుత్వ హయాంలో తెలుగుదేశం పార్టీకి గుంటూరు జిల్లా ఆత్మకూరులో కేటాయించిన స్థలానికి

టీడీపీకి స్థలం కేటాయింపుపై విచారణ జరపండి

హైకోర్టుకు సూచించిన సుప్రీం కోర్టు


న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 5(ఆంధ్రజ్యోతి): కార్యాలయం నిర్మాణానికి గత ప్రభుత్వ హయాంలో తెలుగుదేశం పార్టీకి గుంటూరు జిల్లా ఆత్మకూరులో కేటాయించిన స్థలానికి సంబంధించిన కేసును విచారణ జరపాలని రాష్ట్ర హైకోర్టుకు సుప్రీం కోర్టు సూచించింది. ఈ కేసుతో మెరిట్స్‌ ఆధారంగా విచారణ జరిపి నాలుగు నెలల్లో తేల్చాలని స్పష్టం చేసింది. ప్రభుత్వం కౌంటర్‌ దాఖలు చేయడానికి 2 వారాలు, ఆ తర్వాత దానికి రిజాయిండర్‌ దాఖలు చేయడానికి ప్రతివాదులకు వారం రోజు పాటు సమయం ఇవ్వాలని ఉత్తర్వులు జారీ చేసింది. నిబంధనలను ఉల్లంఘించి టీడీపీకి స్థలాన్ని కేటాయించారంటూ గతంలో వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి హైకోర్టును ఆశ్రయించగా... ఆలస్యంగా కోర్టును ఆశ్రయించారంటూ పిటిషన్‌ను తోసిపుచ్చింది. దాంతో ఆయన సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఆయన దాఖలు చేసిన పిటిషన్‌పై గురువారం న్యాయమూర్తులు జస్టిస్‌ రోహింటన్‌ఫాలి నారిమన్‌, జస్టిస్‌ బీఆర్‌ గవాయ్‌, జస్టిస్‌ హృషికేశ్‌ రాయ్‌తో కూడిన త్రిసభ్య ధర్మాసనం విచారణను ముగించింది. పిటిషనర్‌ తరఫున సీనియర్‌ న్యాయవాది ప్రశాంత్‌ భూషణ్‌, న్యాయవాది అల్లంకి రమేశ్‌ వాదనలు వినిపించారు. టీడీపీ తరఫున సీనియర్‌ న్యాయవాది అభిషేక్‌ మనుసంఘ్వీ వాదనలు వినిపిస్తూ... హైకోర్టుకే ఈ కేసును నివేదించాలని విజ్ఞప్తి చేశారు. స్పందించిన ధర్మాసనం... తామూ అదే అభిప్రాయంతో ఉన్నామని వ్యాఖ్యానించింది. 

Updated Date - 2021-04-16T10:25:56+05:30 IST