నేడే నగారా
ABN , First Publish Date - 2020-03-07T09:10:03+05:30 IST
స్థానిక సమరానికి భేరీ మోగనుంది. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు శనివారం షెడ్యూల్ విడుదల చేస్తామని రాష్ట్ర ఎన్నికల కమిషనర్
- టెన్త్ పరీక్షలు వాయిదా?
- ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు విడుదల కానున్న షెడ్యూల్
- ఎలక్షన్ నోటిఫికేషన్ కూడా ఇస్తాం
- పరీక్షలు వాయిదా వేస్తామని ప్రభుత్వం చెప్పింది
- సిబ్బంది చాలా మంది ఉన్నారు
- వలంటీర్లు అవసరం లేదు
- సచివాలయ సిబ్బందిని, అంగన్వాడీలను ఉపయోగిస్తాం
- కరోనా వైర్సతో ఇబ్బందులుండవు
- పాత కుల ధ్రువీకరణ పత్రాలకు ఓకే
- కొత్తవి తీసుకునేందుకు టైం చాలదు
- మున్సిపోల్స్లోనూ బ్యాలెట్ పేపర్లే
- రాష్ట్ర ఎన్నికల కమిషనర్ స్పష్టీకరణ
అమరావతి, మార్చి 6 (ఆంధ్రజ్యోతి): స్థానిక సమరానికి భేరీ మోగనుంది. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు శనివారం షెడ్యూల్ విడుదల చేస్తామని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమేశ్ కుమార్ ప్రకటించారు. దానితో పాటే ఎన్నికల నోటిఫికేషన్నూ శనివారమే ఇస్తామని తెలిపారు. ఇంటర్, టెన్త్ పరీక్షలకు ఇబ్బందులేర్పడతాయని ఎక్కువ పార్టీలు పేర్కొన్న నేపథ్యంలో.. టెన్త్ పరీక్షలను వాయిదా వేస్తామని, దానివల్ల ఎలాంటి ఇబ్బందులుండవని ప్రభుత్వం స్పష్టం చేసిందని వెల్లడించారు. శుక్రవారం రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ఈసీ) కార్యాలయంలో స్థానిక ఎన్నికల నిర్వహణపై రమేశ్ కుమార్ వరుస సమావేశాలు నిర్వహించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. ‘సీఎస్, డీజీపీ, కలెక్టర్లు, ఎస్పీలతో చర్చించాం. క్షేత్రస్థాయిలో ఎన్నికలు నిర్వహించేందుకు సిబ్బంది, బందోబస్తు పూర్తి స్థాయిలో ఉందని అధికారులు స్పష్టం చేశారు. ఎన్నికలు నిర్వహించేందుకు సరైన పరిస్థితులు ఉన్నాయని ఎస్ఈసీ భావిస్తోంది.
ఎన్నికల షెడ్యూల్ విడుదలకు ముందే రాజకీయ పార్టీలతో చర్చించే సంప్రదాయం ఉంది. ఆ ప్రకారమే అన్ని పార్టీలతో చర్చించాం. కొన్ని పార్టీలు కరోనా వైరస్ వ్యాప్తి చెందుతోందని, ఎన్నికలు నిర్వహించడం కష్టమని అభిప్రాయపడ్డాయి. దీనిపై వైద్యశాఖ అధికారులతో చర్చించాం. ఎన్నికల నిర్వహణకు ఇబ్బందులొచ్చే పరిస్థితులుండవని వారు చెప్పారు. ఎన్నికల ప్రక్రియ సరళీకరణకు కొన్ని సూచనలు చేశారు. వాటిపై చర్యలు తీసుకుంటాం. కుల ధ్రువీకరణ పత్రాలు పొందడానికి తక్కువ సమయం ఉన్నందున పాత సర్టిఫికెట్లను అనుమతిస్తాం. మీసేవ కేంద్ర డైరెక్టర్కు తగు సూచనలు ఇచ్చి వెంటనే సర్టిఫికెట్లు మంజూరుచేసేలా చర్యలు తీసుకుంటాం. ప్రచారానికి మైక్ అనుమతులు సింగిల్విండో విధానంలో అమలు చేయాలని పార్టీలు కోరాయి. కలెక్టర్లకు ఆ మేరకు ఆదేశాలిస్తాం’ అని తెలిపారు. సిబ్బంది, బందోబస్తు కావలసినంత మేరకు ఉన్నట్లు నిర్ధారించామన్నారు.
ప్రలోభాలకు లొంగకుండా, మద్యం, డబ్బు పంపిణీ చేయకుండా ఎన్నికలు నిర్వహించాలని ఎన్నికల కమిషన్ భావిస్తోందన్నారు. అక్రమాలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని ఇప్పటికే ఎన్నికల చట్టంలో ఉందని.. ప్రభుత్వం వాటిని ఫోకస్ చేస్తూ గుర్తింపు తెచ్చేందుకు ప్రయత్నించిందని తెలిపారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపట్ల చట్ట ప్రకారం చర్య తీసుకుంటారని, అది ఎప్పుడూ ఉందని చెప్పారు. వలంటీర్లను ఎన్నికల సేవలకు వినియోగించుకోరాదని కొన్ని పార్టీలు సూచించాయన్నారు. ప్రభుత్వ సిబ్బంది పుష్కలంగా ఉన్నారని.. వలంటీర్లను వినియోగించుకునే అవసరం రాదని చెప్పారు. గ్రామ సచివాలయ ఉద్యోగులను, అంగన్వాడీ వర్కర్ల సేవలను వినియోగిస్తామన్నారు. కొన్నిచోట్ల ఓటర్ల జాబితాల్లో తప్పులు దొర్లాయని పార్టీలు ఫిర్యాదు చేశాయని, వాటిని కలెక్టర్లకు పంపిస్తామన్నారు. ఈవీఎంలను ఎన్నికల కమిషన్ శాస్త్రీయంగా పరిశీలించి వినియోగించిందని.. కానీ మున్సిపల్ ఎన్నికల్లో వాటిని వినియోగించేందుకు ఏ పార్టీ అంగీకరించలేదని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. దానిపై అవగాహన కల్పించాల్సిన అవసరముందని.. ఈ సమయంలో ఇది సాధ్యం కాదని తెలిపారు. అందుకే మున్సిపల్ ఎన్నికలను బ్యాలెట్ విధానంలో చేపట్టాలని నిర్ణయించామని రమేశ్కుమార్ తెలిపారు. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత గ్రామ సచివాలయాలకు వైసీపీ రంగులు తొలగించాలి కదా అని అడుగగా.. ఇది కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత వేయాల్సిన ప్రశ్నని బదులిచ్చారు.