శుద్ధమనసు
ABN , First Publish Date - 2020-11-12T10:03:23+05:30 IST
శరీరం కేవలం గూడు. అది ఆవాసం మాత్రమే..! మానవజన్మ కర్మబద్ధం. కనుక ప్రపంచంలో కర్మనిష్ఠతో ఉండాలి. కానీ అంతరంగంలో బ్రహ్మనిష్ఠలో ఉండాలి. ఇదే మానవ జన్మకున్న విశిష్టత. సమ్యక్ దృష్టితో ప్రాపంచిక కర్తవ్యాలు నిర్వర్తించాలి.
- శరీరం కేవలం గూడు. అది ఆవాసం మాత్రమే..!
మానవజన్మ కర్మబద్ధం. కనుక ప్రపంచంలో కర్మనిష్ఠతో ఉండాలి. కానీ అంతరంగంలో బ్రహ్మనిష్ఠలో ఉండాలి. ఇదే మానవ జన్మకున్న విశిష్టత. సమ్యక్ దృష్టితో ప్రాపంచిక కర్తవ్యాలు నిర్వర్తించాలి.
మేను మాత్రమే నేను కాదు. ఉన్నది ఒక్క ‘నేనే’.
మూడు అవస్థలలో వున్న ‘నేను’ అనే చైతన్యమే.
హృదయం శిల వలె ఉండాలి. కానీ రాతికున్న కాఠిన్యంతో కాకుండా.. కారుణ్య హృదయంతో ప్రపంచంలో సంచరించాలి. సిద్ధాంత రాద్ధాంతాలు, వాదోపవాదాలు లేకుండా మనీషతో వుండాలి. మనీష అంటే స్థిరప్రజ్ఞ, స్థిమిత బుద్ధి.
ఇదికాదు, ఇదికాదంటూ మనసును ఖాళీ చేసుకుంటూ పూర్ణ చైతన్యంతో ప్రవర్తించాలి.
శాస్త్రాధ్యయనంతో మనసును పరిమళభరితం చేసి, స్వాదువుగా తీర్చిదిద్దుకోవాలి.
జడాత్మక దేహం అనుభవించే ఏ వికారమూ నీది కాదు. ఈ ఎరుకలోనే ఉండాలి.
శరీరం కేవలం గూడు. మనం అక్కడే ఉండాలి.
అవిద్య అసలు విద్య కాదు.
అవిద్యకు మరణం.. అంటే మార్పు తథ్యం.
అసలువిద్య ఆత్మవిద్య. అది అవినాశి.
దేనికీ అంటక, దేనినీ అంటించుకొనక కాంతి కటకంవలె, తామరపత్రం మీద నీటిబిందువువలె, తెరమీద బొమ్మవలె ఉండాలి. అంతా బ్రహ్మమే అనుకోగలగటమే అసలైన ముక్తి!!
వీఎస్ఆర్ మూర్తి, ఆధ్యాత్మిక శాస్త్రవేత్త