ఇప్పటికైనా ప్రభుత్వానికి కనువిప్పు కావాలి: జీవీఎల్
ABN , First Publish Date - 2020-05-29T20:25:41+05:30 IST
హైకోర్టు ఇచ్చిన తీర్పుతోనైనా వైసీపీ ప్రభుత్వానికి కనువిప్పు కావాలని..
న్యూఢిల్లీ: హైకోర్టు ఇచ్చిన తీర్పుతోనైనా వైసీపీ ప్రభుత్వానికి కనువిప్పు కావాలని బీజేపీ నేత జీవీఎల్ నరసింహారావు అన్నారు. హైకోర్టు తీర్పుపై స్పందించిన ఆయన మీడియాతో మాట్లాడుతూ రమేష్ కుమార్ కూడా ఇకపై నిష్పక్షపాతంగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. అన్ని రాజకీయ పార్టీలకు అతీతంగా రాజ్యాంగ విలువలతో పని చేయాలని సూచించారు.
ఏపీ హైకోర్టు నిమ్మగడ్డ రమేష్ కుమార్ను మళ్లీ విధుల్లో తీసుకోవాలని ఆదేశిస్తూ ఇచ్చిన సంచలనాత్మక తీర్పు వైసీపీ ప్రభుత్వానికి ఎదురు దెబ్బని జీవీఎల్ వ్యాఖ్యానించారు. తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటే ఇలాంటి దెబ్బలు తప్పవన్న విషయం తెలుసుకోవాలన్నారు. రాజ్యాంగ వ్యవస్థలో ప్రభుత్వాలకు కూడా పరిమితిగలిగిన అధికారాలు మాత్రమే ఉంటాయన్నారు.