కొవిడ్ మృతుల కుటుంబాలకు అండగా ఉంటాం
ABN , First Publish Date - 2021-06-20T09:07:07+05:30 IST
కొవిడ్ మృతుల కుటుంబాలకు అండంగా ఉండాలని అఖిలపక్ష నాయకులు తీర్మానించారు. గుంటూరులో శనివారం సీపీఐ జిల్లా కార్యాలయంలో అఖిలపక్షాల రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది
మరణాల లెక్కలను దాచిపెడుతున్న ప్రభుత్వం
ఫిర్యాదులకు ఫోన్ నంబర్ ఏర్పాటు
రేపు అన్ని కలెక్టరేట్ల వద్ద నిరసనలు..
తీర్మానించిన అఖిలపక్ష రౌండ్ టేబుల్ సమావేశం
గుంటూరు(తూర్పు), జూన్ 19: కొవిడ్ మృతుల కుటుంబాలకు అండంగా ఉండాలని అఖిలపక్ష నాయకులు తీర్మానించారు. గుంటూరులో శనివారం సీపీఐ జిల్లా కార్యాలయంలో అఖిలపక్షాల రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. సమావేశంలో పాల్గొన్న నేతలు పలు అంశాలను విస్తృతంగా చర్చించారు. కొవిడ్ మరణాల సంఖ్యను ప్రభుత్వం దాచిపెడుతోందని విమర్శించారు. ఈ రౌండ్ టేబుల్ పలు నిర్ణయాలను తీసుకుంది. ‘‘కొవిడ్ మృతుల కుటుంబాల సమస్యలు, ప్రభుత్వం నుంచి ఎదురైన ఇబ్బందులు వంటి ఫిర్యాదులు స్వీకరించడానికి అఖిలపక్షం ఆధ్వర్యంలో ఫోన్ నంబర్ 8144226661 ఏర్పాటు. వాస్తవాలను నివేదిక రూపంలో బయటపెట్టాలి. కొవిడ్ మృతుల కుటుంబాలకు రూ.5 లక్షలు ఆర్థిక సహాయం అందించాలి. ఆదాయపు పన్ను దిగువున ఉన్న వారందరికీ నెలకు రూ.7,500 భృతి ఇవ్వాలి. కొవిడ్ మృతుల కుటుంబాలతో 13 జిల్లాల్లో కలెక్టరేట్ల వద్ద సోమవారం నిరసన కార్యక్రమాలు చేపట్టాలి. సమస్య పరిష్కారమయ్యే వరకూ దశల వారీగా ఉద్యమం చేయాలి’’ అని నిర్ణయించారు. కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు నక్కా ఆనంద్బాబు, జనసేన నేత బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.