30 శాతమే కొంటాం!
ABN , First Publish Date - 2020-06-02T09:01:53+05:30 IST
‘రాష్ట్రంలో రైతులు పండించిన పంటలో 30 శాతం మాత్రమే ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది. మిగతా 70ు పంట మార్కెట్లో కనీస మద్దతు ..
మిగతా పంటకు గిట్టుబాటు వచ్చేలా చూస్తాం: సీఎం
అమరావతి, జూన్ 1(ఆంధ్రజ్యోతి): ‘రాష్ట్రంలో రైతులు పండించిన పంటలో 30 శాతం మాత్రమే ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది. మిగతా 70% పంట మార్కెట్లో కనీస మద్దతు ధరకు అమ్ముడయ్యేలా చర్యలు తీసుకుంటాం’ అని సీఎం జగన్ తెలిపారు. సోమవారమిక్కడ తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో పంటల ప్రణాళిక, ఈ-మార్కెటింగ్ ప్లాట్ఫాంపై ఆయన సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మార్కెటింగ్ చేయలేని పంటలు వేస్తే రైతులు నష్టపోతారని స్పష్టం చేశారు. ‘ప్రభుత్వం 30% పంట కొనుగోలు చేస్తే.. మార్కెట్లో పోటీతత్వం పెరిగి మిగిలిన పంటకు గిట్టుబాటు ధర లభిస్తుంది. దీని కోసం ఈ-మార్కెటింగ్ ప్లాట్ఫాంను ఏర్పాటు చేయాలి. ఈ-మార్కెటింగ్లో పంట అమ్మాలంటే నాణ్యత చాలా ముఖ్యం. ఇందుకోసం 10,641 రైతుభరోసా కేంద్రాల్లో గ్రేడింగ్, ప్యాకింగ్ సదుపాయాలు కల్పించాలి’ అని అధికారులను ఆదేశించారు.