అంగుళం కదిలినా ఊరుకోం
ABN , First Publish Date - 2020-07-04T08:54:06+05:30 IST
‘‘అమరావతి నుంచి రాజధాని అంగుళం కదిలినా ఊరుకునేది లేదు. అదే చేయాలనుకుంటే వేలాది ..
రాష్ట్ర భవిష్యత్తు కోసం త్యాగాలకు వెనుకాడం
మహిళా జేఏసీ నేత డాక్టర్ రాయపాటి శైలజ
గుంటూరు, జూలై 3(ఆంధ్రజ్యోతి): ‘‘అమరావతి నుంచి రాజధాని అంగుళం కదిలినా ఊరుకునేది లేదు. అదే చేయాలనుకుంటే వేలాది మంది శవాలపై నుంచి రాజధానిని మార్చాలి’’ అని మహిళా జేఏసీలో కీలక నేత డాక్టర్ రాయపాటి శైలజ అన్నారు. రాష్ట్ర భవిష్యత్తు కోసం ఎంతటి త్యాగాలకైనా వెనుకాడేది లేదన్నారు. అమరావతి ఉద్యమం 200వ రోజుకు చేరుకున్న సందర్భంగా తన ఉద్యమానుభవాలను ఆమె ‘ఆంధ్రజ్యోతి’తో పంచుకున్నారు.
ఉద్యమంలో మహిళల పాత్ర ఏమిటి?
అమరావతి ఉద్యమాన్ని ముందుకు నడిపిస్తోంది మహిళలే అనడంలో ఎటువంటి సందేహం లేదు. దేనికీ వెరవకుండా ఇంటిని చక్కబెట్టుకుంటూ, పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దుకుంటూ రాష్ట్ర భవిష్యత్తు కోసం పోరాటం చేస్తున్నారు. దుర్గమ్మ దర్శనానికి వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్న నాటినుంచి తెగింపు పెరిగింది. మహిళలు శిబిరాలకు వచ్చి తమ పట్టుదలను చూపారు.
వైద్యవృత్తిలో ఉండి ఉద్యమంలోకి ఎందుకు?
రాజధాని కోసం మహిళలు చేస్తున్న పోరాటం చూసి వారితో మాట్లాడదామని తుళ్లూరు వెళ్లాను. అప్పుడు వారి మాటలు విని కన్నీళ్లు వచ్చాయి. అన్నీ వదిలేసి వారితో కలసి పోరు సాగించాలని అనాడే నిర్ణయించుకున్నాం. వారికి వైద్యపరమైన సలహాలు ఇస్తూనే మహిళా జేఏసీతో కలిసి ఉద్యమం చేస్తున్నాం. .
కరోనా కాలంలో ఉద్యమం తీరెలా ఉంది?
రాజధాని కోసం ఉద్యమం చేస్తున్న మహిళల్లో కరోనా మరింత ఐక్యతను పెంచింది. బృందాలుగా ఏర్పడి నిరసనలు కొనసాగిస్తున్నారు. వాటిని ప్రపంచానికి తెలియజేయటానికి సోషల్ మీడియాను వేదికగా చేసుకున్నారు.
భవిష్యత్ కార్యాచరణ ఏమిటి?
అమరావతే రాజధాని అని ప్రభుత్వం నుంచి స్పష్టమైన ప్రకటన వచ్చేవరకు పోరు ఆపేది లేదు. ఉద్యమం ప్రారంభించి 200 రోజులైన సందర్భంగా సామూహిక నిరాహార దీక్షలకు దిగుతున్నాం. పరిస్థితులు చక్కబడిన తరువాత ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తాం.