మొత్తం ఖర్చు కేంద్రమే భరించాలి

ABN , First Publish Date - 2020-10-24T08:33:26+05:30 IST

జాతీయ ప్రాజెక్టు అయిన పోలవరానికి రాష్ట్ర ప్రభుత్వం ఖర్చుచేసిన నిధులను షరతుల్లేకుండా విడుదల చేయాలని రాష్ట్ర ఆర్థిక

మొత్తం ఖర్చు కేంద్రమే భరించాలి

నిర్మలా సీతారామన్‌కు బుగ్గన వినతి

జాతీయ ప్రాజెక్టు అయిన పోలవరానికి రాష్ట్ర ప్రభుత్వం ఖర్చుచేసిన నిధులను షరతుల్లేకుండా విడుదల చేయాలని రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. ఆయన శుక్రవారమిక్కడ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో సమావేశమయ్యారు. తర్వాత ఆయన విలేకరులతో మాట్లాడారు. జాతీయ ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతలను గతంలో చంద్రబాబు ప్రభుత్వం తీసుకున్నప్పటికీ.. కేంద్ర ప్రభుత్వ పరిధిలోని పీపీఏనే పనులన్నీ పర్యవేక్షిస్తోందన్నారు.


రాష్ట్రప్రభుత్వం పెట్టిన దాదాపు రూ.4 వేల కోట్ల ఖర్చును పీపీఏ కూడా ఆమోదించినందున.. తక్షణమే పెండింగ్‌లో ఉన్న నిధులను విడుదల చేయాలని కోరినట్లు తెలిపారు. కాంట్రాక్టుల కోసం అప్పటి చంద్రబాబు ప్రభుత్వం నిర్మాణ బాధ్యతలను తీసుకుని రాష్ట్రానికి అన్యాయం చేసిందని ఆరోపించారు. 2014లో నిర్ధారించిన అంచనా వ్యయానికి కట్టుబడుతూ కేంద్రంతో చంద్రబాబు ప్రభుత్వం ఒప్పందం చేసుకోవడంవల్లే..  పెరిగిన అంచనా వ్యయానికి సమ్మతించేందుకు కేంద్రం ఇప్పుడు వెనుకాడుతోందని చెప్పారు.


ప్రాజెక్టు పనులను ఇప్పుడు శరవేగంతో చేపట్టాలని నిర్ణయించినందున.. అంచనాలను సవరించాల్సి వచ్చిందని, దీంతో టీడీపీ ప్రభుత్వం కేంద్రంతో చేసుకున్న ఒప్పందాలు బయటపడ్డాయన్నారు. అంచనా వ్యయంపై కేంద్రం సమీక్షించాలని, జలశక్తి శాఖ, పీపీఏ, కేంద్రం కలిసి పరిష్కార మార్గం కనుక్కోవాలని వ్యాఖ్యానించారు.


Updated Date - 2020-10-24T08:33:26+05:30 IST