హైదరాబాద్లో ఆవిర్భావ వేడుకలు
ABN , First Publish Date - 2022-03-04T08:30:10+05:30 IST
తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ వేడుకలు హైదరాబాద్లో... మహానాడును విజయవాడలో జరపాలని తెలుగుదేశం పార్టీ నిర్ణయించింది.
విజయవాడలో మహానాడు.. టీడీపీ పొలిట్బ్యూరో నిర్ణయం
అమరావతి, మార్చి 3(ఆంధ్రజ్యోతి): తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ వేడుకలు హైదరాబాద్లో... మహానాడును విజయవాడలో జరపాలని తెలుగుదేశం పార్టీ నిర్ణయించింది. గురువారం ఇక్కడ కేంద్ర కార్యాలయంలో జరిగిన ఆ పార్టీ పొలిట్బ్యూరో సమావేశంలో ఈ నిర్ణయం తీసుకొన్నారు. పార్టీ అధినేత చంద్రబాబు అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది. టీడీపీ ఆవిర్భవించి ఈ ఏడాదికి 40 ఏళ్లు అవుతోంది. దీనిని పురస్కరించుకొని ఈసారి ఆవిర్భావ వేడుకలు ఈ నెల 29న హైదరాబాద్లో ఘనంగా జరపాలని నిర్ణయించారు.
వ్యవస్థాపకుడు ఎన్టీ రామారావు టీడీపీని హైదరాబాద్లో స్థాపించడంతో ఆవిర్భావ వేడుకలు అక్కడే జరపాలని నిశ్చయించారు. మే నెలాఖరులో జరిగే మహానాడు కార్యక్రమాన్ని విజయవాడలో జరపాలని నిర్ణయించారు. ఈ ఏడాది ఎన్టీ రామారావు శతజయంతి వేడుకలు జరగనున్నాయి. దానిని పురస్కరించుకొని మహానాడును ఘనంగా జరపాలని నిర్ణయించారు. ఈ రెండు కార్యక్రమాల నిర్వహణ, ఏడాదిపాటు ఎన్టీఆర్ శత జయంతి వేడుకలు జరపడంపై కసరత్తుకు ఒక కమిటీ వేయాలని నిర్ణయించారు.