నెదర్లాండ్స్ అగ్నిప్రమాదంలో తెలుగు NRI మృతి!
ABN , First Publish Date - 2022-01-07T19:00:41+05:30 IST
నెదర్లాండ్స్ రాజధాని హెగ్లోని ఓ భవనంలో ఈ నెల 5న సంభవించిన అగ్నిప్రమాదంలో తీవ్రంగా గాయపడిన హైదరాబాద్కు చెందిన ఎన్నారై ఒకరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయాడు.
ఎన్నారై డెస్క్: నెదర్లాండ్స్ రాజధాని హెగ్లోని ఓ భవనంలో ఈ నెల 5న సంభవించిన అగ్నిప్రమాదంలో తీవ్రంగా గాయపడిన హైదరాబాద్కు చెందిన ఎన్నారై ఒకరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయాడు. మృతుడు నగరంలోని ఆసిఫ్ నగర్ వాసి అబ్దుల్ హదీ(43). కొన్ని సంవత్సరాలుగా హెగ్లోనే ఉంటున్న అబ్దుల్కు నెదర్లాండ్స్ పర్మినెంట్ వీసా ఉన్నట్లు తెలిసింది. ఈ నెల 5న అబ్దుల్ నివాసం ఉంటున్న హెగ్ నగరంలోని ష్విల్డెర్షిజ్ భవనంలో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన అబ్దుల్ను తోటివాళ్లు సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ గురువారం తుదిశ్వాస విడిచాడు. ఈ విషయాన్ని అబ్దుల్ స్నేహితులు ఫోన్ ద్వారా తమకు తెలియజేసినట్లు తండ్రి మహ్మద్ అహ్సాన్ చెప్పారు. కాగా, చివరిసారిగా 2021 జనవరిలో స్వదేశానికి వచ్చిన అబ్దుల్ తిరిగి మార్చిలో నెదర్లాండ్స్ వెళ్లిపోయాడు. మళ్లీ 2022 జనవరిలో స్వదేశానికి వస్తానని చెప్పాడని, ఇంతలోనే ఈ ఘోరం జరిగిపోయిందంటూ తండ్రి మహ్మద్ అహ్సాన్ కన్నీరుమున్నీరు అవుతున్నారు. తమ కొడుకు మృతదేహాన్ని వీలైనంత త్వరగా స్వదేశానికి తరలించాలంటూ భారత విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్, నెదర్లాండ్స్లోని భారత ఎంబసీ అధికారులకు ఆయన విజ్ఞప్తి చేశారు.