అవార్డుతో బాధ్యత పెరిగింది: ఏలూరి
ABN , First Publish Date - 2020-02-24T09:14:29+05:30 IST
తెలుగుదేశం పార్టీకి చెందిన పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావుకు అరుదైన గౌరవం దక్కింది. జాతీయ స్థాయిలో శాసనసభ్యులకిచ్చే ప్రతిష్ఠాత్మక ఆదర్శ యువ ఎమ్మెల్యే అవార్డు ఆయన సొంతమైంది.
పర్చూరు, ఫిబ్రవరి 23: తెలుగుదేశం పార్టీకి చెందిన పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావుకు అరుదైన గౌరవం దక్కింది. జాతీయ స్థాయిలో శాసనసభ్యులకిచ్చే ప్రతిష్ఠాత్మక ఆదర్శ యువ ఎమ్మెల్యే అవార్డు ఆయన సొంతమైంది. ఢిల్లీలోని రాజ్పథ్ మౌలానా ఆజాద్ రోడ్డులోని విజ్ఞాన్ భవన్లో ఆదివారం జరిగిన కార్యక్రమంలో ఏలూరి ఈ అవార్డును అందుకున్నారు. భారత స్టూడెంట్ పార్లమెంట్ పదో వార్షికోత్సవ వేడుకల్లో భాగంగా దేశవ్యాప్తంగా అత్యుత్తమ పనితీరు కనబర్చిన ఇద్దరు ఎమ్మెల్యేలకు ఈ అవార్డును ప్రదానం చేశారు. జార్ఖండ్ స్పీకర్ రవీంద్రనాథ్ మహతో చేతుల మీదుగా ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు అవార్డు అందుకున్నారు. ఈ సందర్భంగా ఏలూరి మాట్లాడుతూ ఈ అవార్డు తన బాధ్యతను మరింత పెంచిందన్నారు. టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు, జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్తోపాటు ఎమ్మెల్యేలు అచ్చెన్నాయుడు, అనగాని సత్యప్రసాద్, కరణం బలరాం కృష్ణమూర్తి, గొట్టిపాటి రవికుమార్, పలువురు రాజకీయ ప్రముఖులు ఆయనకు అభినందనలు తెలియజేశారు.