బాలకృష్ణకు నచ్చిన కథతో చిరంజీవి సినిమా
ABN , First Publish Date - 2020-06-28T05:30:00+05:30 IST
అలెగ్జాండర్ డ్యూమాస్ 175 ఏళ్ల నాడు ‘ద కౌంట్ ఆఫ్ మాంటి క్రిస్టో ’ పేరుతో ఫ్రెంచ్లో ఓ నవల రాశారు. మూల రచన ఆధారంగా ఫ్రెంచ్లోనూ, ఇంగ్లిషులోనూ సినిమాలు వచ్చాయి...
అలెగ్జాండర్ డ్యూమాస్ 175 ఏళ్ల నాడు ‘ద కౌంట్ ఆఫ్ మాంటి క్రిస్టో ’ పేరుతో ఫ్రెంచ్లో ఓ నవల రాశారు. మూల రచన ఆధారంగా ఫ్రెంచ్లోనూ, ఇంగ్లిషులోనూ సినిమాలు వచ్చాయి. 1950 ప్రాంతాల్లో ఈ నవలను తెలుగులోకీ అనువదించారు. అమాయకుడైన ఓ వ్యక్తిపై రాజకీయ నేరం మోపి జైలుకు పంపిస్తారు. జైలు నుంచి తిరిగి వచ్చిన తర్వాత ఆ వ్యక్తి తన శత్రువులను మెంటల్గా టార్చర్ చేసి చంపుతాడు. 1815 నాటి ఫ్రెంచ్ రాజకీయాల నేపథ్యంలో కథ సాగుతుంది. మంచి మలుపులు, యాక్షన్ పార్ట్ కథలో ఉన్నాయి. నందమూరి బాలకృష్ణకు ఎవరో ఈ కథ గురించి చెబితే ఆయన సినిమా చూశారు. బాగా నచ్చడంతో తెలుగులో తీయాలని ప్రయత్నించారు కానీ ఎందుకో కుదరలేదు.
‘ఖైదీ’ సినిమా విడుదలైన మూడేళ్ల అనంతరం చిరంజీవితో మరో చిత్రం తీయడం కోసం సంయుక్తా మూవీస్ అధినేత తిరుపతి రెడ్డి కథ కోసం అన్వేషిస్తున్నారు. అప్పుడే ఆయన మిత్రుడు, ఛాయాగ్రాహకుడు ఎస్.గోపాలరెడ్డి ‘ద కౌంట్ ఆఫ్ మాంటి క్రిస్టో’ నవల గురించి చెప్పి, ఆ కథను తెలుగులో తీస్తే బాగుంటుందని సలహా ఇచ్చారు. ఆ సినిమా వీడియో కేసెట్ కూడా తిరుపతిరెడ్డికి ఇచ్చారు గోపాలరెడ్డి. ఆ సినిమా తిరుపతిరెడ్డికి బాగా నచ్చింది. వెంటనే చిరంజీవి, దర్శకుడు కోదండరామిరెడ్డిలకు ఆ సినిమా గురించి చెప్పారు. వాళ్లకీ కథ నచ్చడంతో ‘వేట’ సినిమాకు శ్రీకారం చుట్టారు. స్వాతంత్య్ర సమరానికి ముందు జరిగిన కథగా తెలుగులో దీన్ని మలిచారు పరుచూరి సోదరులు. పగ, ప్రతీకారం అంశాలతో స్ర్కిప్ట్ తయారు చేశారు.
ఈ సినిమా కోసం చిరంజీవి 60 రోజులు పని చేశారు. కొత్త తరహా నేపథ్యంలో తీస్తున్న సినిమా కావడంతో ‘ద కౌంట్ ఆఫ్ మాంటి క్రిస్టో’ సినిమాలో హీరోకు ఏయే గెటప్స్ ఉన్నాయో తెలుగులో కూడా చిరంజీవి అవే వాడారు. ఈ కారణంగా తన కెరీర్లో అంతవరకూ వెయ్యని రకరకాల గెట్ప్సలో చిరంజీవి కనిపిస్తారు. ‘వేట’ చిత్ర కథానాయిక జయప్రద. ఆమె ఈ చిత్రం కోసం 38 రోజులు వర్క్ చేశారు. ‘47 రోజులు’ చిత్రం తర్వాత చిరంజీవి, జయప్రద కలసి నటించిన సినిమా ఇదే. కోటి రూపాయల వ్యయంతో రూపుదిద్దుకొన్న ‘వేట’ ఆశించిన విజయం సాధించలేదు.
-వినాయకరావు