ఆకలితో అలమటిస్తున్న ప్రవాసీయులను ఆదుకున్న తెలుగు అసోసియేషన్

ABN , First Publish Date - 2022-07-04T01:39:58+05:30 IST

ఎడారి దేశంలో చాలాకాలంగా ఆనందంగా గడుపుతున్న కొంత మంది తెలుగు ప్రవాసీయుల పరిస్ధితి ఒక్కసారిగా మారిపోవడంతో వేతనాలు అటుంచి కనీసం తినడానికి తిండికి కూడా ఇబ్బంది ఎదుర్కోవల్సిన పరిస్ధితిలో దుబాయిలోని తెలుగు సంఘం వారికి అండగా నిలిచింది.

ఆకలితో అలమటిస్తున్న ప్రవాసీయులను ఆదుకున్న తెలుగు అసోసియేషన్
ఫుజిరాలో ఆహార సామాగ్రిని అందిస్తున్న తెలుగు అసోసియెషన్ ప్రతినిధులు

ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి: ఎడారి దేశంలో చాలాకాలంగా ఆనందంగా గడుపుతున్న కొంత మంది తెలుగు ప్రవాసీయుల పరిస్ధితి ఒక్కసారిగా మారిపోవడంతో వేతనాలు అటుంచి కనీసం తినడానికి తిండికి కూడా ఇబ్బంది ఎదుర్కోవల్సిన పరిస్ధితిలో దుబాయిలోని తెలుగు సంఘం వారికి అండగా నిలిచింది. యు.ఏ.ఇలోని ఫుజిరాలో ఒక క్వారి సంస్ధలో ఆంధ్రులతో సహా 20 మంది భారతీయులు చాల కాలంగా పని చేస్తున్నారు. కానీ గత సంవత్సరం నుండి వీరికి సంస్ధ వేతనాలు చెల్లించడం లేదు. స్వదేశానికి తిరిగి వెళ్ళిపోవాలనుకొన్న వారికి గ్రాట్యూటి, బకాయి వేతనాలు వగైరా కూడా ఇవ్వడం లేదు. ఒక వైపు రావల్సిన బకాయిలు రాలేక, జీతం లేక తిండికి కూడా వీరు ఇబ్బందులు పడుతున్నారు.


వీరి దయనీయ స్ధితి గురించి భారతీయ కాన్సులేట్ ద్వారా దుబాయిలోని తెలుగు అసోసియెషన్ తెలుసుకుని అండగా నిలిచింది. అసోసియేషన్‌కు చెందిన సాయికృష్ణా, చైతన్య, భీంశంకర్, ఫహీం, సాయి ప్రకాశ్, విజయభాస్కర్‌లు ఈ మెరకు ఫుజిరాకు వెళ్ళి ఆకలితో అలమటిస్తున్న కార్మికులకు నెలరోజులకు సరిపడా ఆహార సామాగ్రి, ఇతర నిత్యావసర సరుకులు అందించారు. ఈ క్రమంలో ​దుబాయిలోని భారతీయ కాన్సులేటులోని కౌన్సల్ తాడు మాము తెలుగు అసోసియెషన్ ప్రతినిధులను అభినందించారు. దుబాయిలోని తెలుగు అసోసియేషన్ గతంలోనూ అనేక సహాయక కార్యక్రమాలు చేపట్టంది.



Updated Date - 2022-07-04T01:39:58+05:30 IST