అబ్బో ఇదేం వాన
ABN , First Publish Date - 2020-04-10T07:15:07+05:30 IST
చాలా ప్రాంతాల్లో చేతికొచ్చిన వరి పంట. కూలీలను పిలిచి పంటను కోయించారు. కల్లం చేసేంత లోపే మాయదారి వాన, వరి మెదలను తడిపేసింది.
నీట మునిగిన వరి పంట, తడసిన ధాన్యం
మొక్కజొన్న, కూరగాయల పంటలకూ నష్టం
(ఆంధ్రజ్యోతి న్యూస్నెట్వర్క్): చాలా ప్రాంతాల్లో చేతికొచ్చిన వరి పంట. కూలీలను పిలిచి పంటను కోయించారు. కల్లం చేసేంత లోపే మాయదారి వాన, వరి మెదలను తడిపేసింది. రాష్ట్రవ్యాప్తంగా గురువారం పలు ప్రాంతాల్లో వర్షం పడింది. చాలా చోట్ల కోసిన వరి పంట నీట మునిగింది. వరితోపాటు అరటి తోటలు, కూరగాయ పంటలు, మొక్కజొన్న పంటలకూ తీవ్ర నష్టం జరిగింది. రంగారెడ్డి జిల్లాలోని రంగాపూర్, చాకలిగుట్టతాండా పరిధిలో 73 ఎకరాల్లో వరిపంటకు నష్టం వాటిల్లింది. ఇళ్లు, పశువుల షెడ్లు ధ్వంసమయ్యాయి. ఇబ్రహీం పట్నం, మంచాల, యాచారంలో 1070 ఎకరాల్లో పంటకు నష్టం జరిగింది. కందుకూరు మండలంలో జైత్వారం, గపూర్నగర్ గ్రామాల్లో 68 ఎకరాల్లో పంటకు నష్టం వాటిల్లింది. కొత్తగూడెం జిల్లా ఆశ్వారావుపేట నియోజకవర్గంలో పరిధిలోని గ్రామాల్లో 150 ఎకరాల్లో అరటి తోటలు నేలకొరిగాయి. మలకంపల్లి మండలంలో 150 ఎకరాల్లోని వరి పంట దెబ్బతింది. యాదాద్రి జిల్లాలో 20వేల ఎకరాల్లో పంట నష్టం జరిగింది.