ఏపీ కన్నా తెలంగాణ పేద రాష్ట్రం!

ABN , First Publish Date - 2022-01-05T07:58:44+05:30 IST

విభజిత ఏపీలో కన్నా తెలంగాణలోనే పేదరికం ఎక్కువగా ఉందంటోంది నీతి ఆయోగ్‌.

ఏపీ కన్నా తెలంగాణ పేద రాష్ట్రం!

  • పేదరికంలో  దేశంలో18వ స్థానంలో తెలంగాణ
  • 20వ స్థానంలో ఏపీ.. నీతి ఆయోగ్‌ నివేదికలో వెల్లడి
  • 2015-16 జాతీయ  సర్వే  వివరాల మేరకు నివేదిక
  • అత్యంత పేద రాష్ట్రంగా మొదటి స్థానంలో బిహార్‌
  • తెలంగాణలో ఆదిలాబాద్‌ జిల్లాలో ఎక్కువ పేదరికం
  • రెండు, మూడు స్థానాల్లో పాలమూరు, నిజామాబాద్‌


హైదరాబాద్‌, జనవరి 4 (ఆంధ్రజ్యోతి): విభజిత ఏపీలో కన్నా తెలంగాణలోనే పేదరికం ఎక్కువగా ఉందంటోంది నీతి ఆయోగ్‌. భారత ప్రణాళిక సంఘం స్థానంలో ఏర్పాటైన నీతి అయోగ్‌ మొదటిసారిగా రూపొందించిన జాతీయ బహువిధ దారిద్య్ర సూచిక(ఎన్‌ఎంపీఐ)లో  ఈ విషయాన్ని పేర్కొంది. పేదరికంలో దేశంలోని 28 రాష్ట్రాల్లో తెలంగాణ 18వ స్థానంలో ఉండగా, ఆంధ్రప్రదేశ్‌ 20 స్థానంలో నిలిచినట్లు తెలిపింది. అయితే 2015-16లో తయారైన ‘జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే(ఎన్‌ఎ్‌ఫహెచ్‌ఎస్‌)’ వివరాలను పరిగణనలోకి తీసుకుని ఈ నివేదికను రూపొందించింది. ఇందుకు ప్రధానంగా ఆరోగ్యం, పోషకాహారం, విద్య, జీవన ప్రమాణాలు వంటి నాలుగు రంగాలను ఆధారంగా చేసుకుని ప్రజల స్థితిగతులను తెలుసుకుంది. ఇక వైద్య ఆరోగ్య రంగానికి సంబంధించి పోషకాహారం, చిన్నపిల్లల, కిశోర బాలల మరణాలు, తల్లుల ఆరోగ్యం, విద్యారంగంలో పిల్లలు పాఠశాలలకు వెళ్లిన కాలం, హాజరు శాతం, జీవన ప్రమాణాలకు సంబంధించి వంటనూనెలు, పారిశుధ్యం, తాగునీరు, విద్యుత్తు, గృహ వసతి, ఆస్తులు, బ్యాంకు అకౌంట్లు వంటి 12 అంశాల ఆధారంగా పేదరికాన్ని నీతి ఆయోగ్‌ అంచనా వేసింది. దేశంలోని 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాల్లో మొత్తం 700కు పైగా జిల్లాల్లో ప్రజల స్థితిగతులు, జీవన ప్రమాణాలు, పేదరికపు ఛాయలను ఎత్తి చూపింది. 


దీని ప్రకారం.. పేదరిక సూచీలో దేశంలోనే బిహార్‌ రాష్ట్రం 51.91 శాతంతో మొదటి స్థానంలో ఉంది. ఆ తర్వాత 42.16 శాతంతో ఝార్ఖండ్‌ రెండో స్థానంలో, 37.79 శాతంతో ఉత్తరప్రదేశ్‌ మూడో స్థానంలో ఉన్నాయి. పేదరికం అతి తక్కువగా కేరళలో (0.71 శాతం) ఉన్నట్లు నీతి ఆయోగ్‌ నివేదిక పేర్కొంది. ఆ తర్వాత పేదరికం తక్కువగా ఉన్న రా ష్ట్రాల్లో గోవా (3.82%), సిక్కిం(3.82%) ఉన్నాయి. రాష్ట్రంలోనే పేదరికంలో ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా మొదటి స్థానంలో ఉన్నట్లు నీతి ఆయోగ్‌ నివేదికలో పేర్కొంది. ఉమ్మడి పది జిల్లాల ఆధారంగా రాష్ట్రం లో పేదరికాన్ని అంచనా వేసింది.  ఇందులో ఉమ్మ డి ఆదిలాబాద్‌ జిల్లాలో ఇప్పటికీ ఎక్కువ శాతం పేదరికం తాండవిస్తోందని తెలిపింది. ఈ జిల్లాలో ఏకంగా 27.43 శాతం పేదరికం ఉంది. ఇక రెండు, మూడో స్థానాల్లో వరుసగా మహబూబ్‌నగర్‌ (26.11 శాతం) నిజామాబాద్‌ (21.44 శాతం) ఉన్నట్లు పేర్కొంది. హైదరాబాద్‌, రంగారెడ్డి, కరీంనగర్‌ జిల్లాల్లో పేదరికం తక్కువగా ఉంది. నిజానికి ఆదిలాబాద్‌ జిల్లాలోనే గోదావరి నది ప్రవేశిస్తుంది. ఇక్కడ అనేక చిన్న నదులు, వాగులు, వంకలు ఉన్నాయి. చిన్న, మధ్య తరహా ప్రాజెక్టులను నిర్మించడానికి చాలా అవకాశాలున్నాయని సాక్షాత్తు రాష్ట్ర జల వనరుల శాఖే గుర్తించింది. 11 మధ్య తరహా ప్రాజెక్టులను కూడా నిర్మిస్తున్నారు. సారవంతమైన నల్లరేగడి నేలలున్నాయి. అయినా ఆదిలాబాద్‌ జిల్లా నుంచి కరువు ఛాయలు దూరం కాకపోవడం విచారకరం. కాగా, కృష్ణానది తలాపున ప్రవహిస్తున్నా మహబూబ్‌నగర్‌ జిల్లాలో పేదరికం ఇంకా తొలగిపోలేదు. ఇక ముఖ్యమంత్రి కేసీఆర్‌ సొంత జిల్లా అయిన మెదక్‌ 17.90 శాతం పేదరికంతో నాలుగో స్థానంలో నిలిచింది. అతి తక్కువగా హైదరాబాద్‌ జిల్లాలో 4.27 శాతం పేదరికం ఉంది. రంగారెడ్డి జిల్లాలో 5.83 శాతం, కరీంనగర్‌ జిల్లాలో 9.20 శాతం పేదరికం ఉన్నట్లు నీతి ఆయోగ్‌ వెల్లడించింది.

Updated Date - 2022-01-05T07:58:44+05:30 IST