ఏపీ సీఎం జగన్కు తెలంగాణ హైకోర్టు నోటీసులు
ABN , First Publish Date - 2021-12-13T21:30:23+05:30 IST
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి తెలంగాణ హైకోర్టు నోటీసులు జారీ చేసింది.
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి తెలంగాణ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. జగన్ బెయిల్ రద్దు పిటిషన్పై సోమవారం హైకోర్టులో విచారణ జరిగింది. జగన్ బెయిల్ రద్దు చేయాలని కోరుతూ ఇప్పటికే ఎంపీ రఘురామకృష్ణంరాజు హైకోర్టును ఆశ్రయించారు. ఆదాయానికి మించి ఆస్తుల కేసులో జగన్పై 11 చార్జ్షీట్లు ఉన్నాయని రఘురామ తరఫున న్యాయవాది కోర్టుకి తెలిపారు. బెయిల్ రద్దు చేసి 11 చార్జ్షీట్లను విచారించాలని న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు. కాగా జగన్ బెయిల్ రద్దు పిటిషన్ను సీబీఐ కోర్టు కొట్టి వేయడంతో రఘురామ హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై ఇవాళ విచారణ జరిపిన హైకోర్టు బెయిల్ రద్దు పిటిషన్పై ఏపీ సీఎం జగన్కు నోటీసులు జారీ చేస్తూ.. తదుపరి విచారణ రెండు వారాలకు వాయిదా వేసింది.