పది జిల్లాల్లో భూముల వేలం?
ABN , First Publish Date - 2022-02-06T08:20:29+05:30 IST
రాష్ట్రంలో పది జిల్లాల్లో భూములు వేలం వేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.
కొన్ని ప్రాంతాల్లో లేఅవుట్లు చేసి ప్లాట్ల విక్రయం
మధ్యవర్తిత్వం చేయనున్న హెచ్ఎండీఏ, టీఎస్ఐఐసీ
ఇప్పటికే కసరత్తు ప్రారంభించిన ప్రభుత్వం
బాగా ఆదాయం వచ్చే భూముల జాబితా సిద్ధం!
హైదరాబాద్ సిటీ, ఫిబ్రవరి 5 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో పది జిల్లాల్లో భూములు వేలం వేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. హైదరాబాద్ శివారు ప్రాంతాల్లోని జిల్లాలతో పాటు ఆదాయం వచ్చేందుకు అవకాశం ఉన్న ముఖ్యమైన జిల్లాల్లో విక్రయించడానికి భూముల వివరాలను సిద్ధం చేసిన్నట్లు తెలిసింది. భూముల అమ్మకం ద్వారా వచ్చే ఆదాయాలపై, లేఅవుట్ డెవలప్ చేస్తే వచ్చే ఆదాయాలపై అంచనాలు వేసింది. కొన్ని ప్రాంతాల్లో లేఅవుట్లను అభివృద్ధి చేసి ప్లాట్లను విక్రయించాలని ప్రభుత్వం నిర్ణయించిన్నట్లు తెలిసింది. భూములు, ప్లాట్ల విక్రయాల్లో జిల్లాల్లోని రెవెన్యూ, ఇతర విభాగాలకు పూర్తిస్థాయిలో సామర్థ్యం లేకపోవడంతో హెచ్ఎండీఏ, టీఎ్సఐఐసీ సంస్థల సేవలను వినియోగించుకోనుంది. హైదరాబాద్ శివారు జిల్లాలు రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి, మెదక్లో కొన్ని ప్రభుత్వ భూములను పదేళ్ల క్రితమే రాష్ట్ర ప్రభుత్వం హెచ్ఎండీఏకు అప్పగించింది. ఇందులో కొన్ని భూములను ఇప్పటికే వివిధ అవసరాల కోసం వినియోగిస్తుండగా, వినియోగించని భూము లు సైతం ఉన్నాయి. హెచ్ఎండీఏకు ప్రభుత్వం అప్పగించిన భూముల్లో రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో కలిపి 7,452-30 ఎకరాలు, హైదరాబాద్లో 249 ఎకరాలు, మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో 558 ఎకరాలు ఇచ్చారు. మొత్తం 8,260 ఎకరాలకుగాను 3,886 ఎకరాలు వినియోగిస్తున్నారు. ఇంకా 4,374 ఎకరాలు అందుబాటులో ఉన్నా యి. యాదాద్రి భువనగిరి, వరంగల్, నిజామాబాద్, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్ నగర్, జోగులాంబ గద్వాల్ తదితర జిల్లాలోనూ భూములు అమ్మడానికి ఉన్న అవకాశాలను అధికారులు పరిశీలిస్తున్నారు.
వివరాలు అందజేసిన కలెక్టర్లు!
ఎంసీహెచ్ఆర్డీలో ఇటీవల జరిగిన కలెక్టర్ల సమావేశంలో జిల్లాల్లో భూముల విక్రయాలపై కసరత్తు చేసిన్నట్లు తెలిసింది. కలెక్టర్లు ప్రభుత్వ భూముల వివరాలు అందించారు. విక్రయిస్తే బాగా ఆదాయం వచ్చే భూముల జాబితాను రూపొందించారు. అయితే భూములను గుర్తించడం, హద్దులను నిర్ణయించడం మాత్రమే తమకు సాధ్యమవుతుందని, అభివృద్ధి పనులు, భూముల ఈ-వేలం నిర్వహించడం తమకు సాధ్యమవ్వదని తేల్చిచెప్పినట్లు తెలిసింది. తమ జిల్లాల్లో ఆదాయం రావడానికి అవకాశం ఉన్న భూములను తాము అందిస్తామని, హెచ్ఎండీఏ, టీఎ్సఐఐసీల ద్వారా విక్రయించాలని పలువురు కలెక్టర్లు విజ్ఞప్తి చేయగా అందుకు ఉన్నతాధికారులు అంగీకరించారు. దాంతో ఆ మేరకు ఇప్పటికే హెచ్ఎండీఏకు ఐదు జిల్లాలు, టీఎ్సఐఐసీకి ఐదు జిల్లాలు అప్పగించారు. భూములు, ప్లాట్ల విక్రయానికి నోటిఫికేషన్ విడుదల చేసినప్పటి నుంచి కేంద్ర ప్రభుత్వ సంస్థ ఎంఎ్సటీసీ ఈ-వేలం ప్రక్రియ పూర్తి చేసే వరకు హెచ్ఎండీఏ, టీఎ్సఐఐసీ మధ్యవర్తిత్వం నిర్వహిస్తాయని ఓ అధికారి తెలిపారు. హైదరాబాద్ జిల్లా పరిధిలో ప్రస్తుతం విక్రయించడానికి అవసరమైన భూములు లేకపోగా, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల పరిధిలోనే వందలాది ఎకరాల ప్రభుత్వ భూములున్నాయి. ఆయా భూములను అవసరాలకు అనుగుణంగా హెచ్ఎండీఏ, టీఎ్సఐఐసీ ఇప్పటికే విక్రయిస్తున్నాయి. ఉప్పల్ భగాయత్, కోకాపేటలో భూ ములను హెచ్ఎండీఏ విక్రయించగా,ఖానామేట్, పుప్పాలగూడలో భూములను టీఎ్సఐఐసీ ద్వారా ప్రభుత్వం విక్రయించింది. కోకాపేటలోని 49ఎకరాల ద్వారా రూ.2వేల కోట్లు, ఖానామేట్లో 15 ఎకరాల విక్రయం ద్వారా రూ.730 కోట్ల ఆదాయం వచ్చింది. ఈ భూముల విక్ర యం ద్వారా వచ్చిన ఆదాయం రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు చేరగా, ఉప్పల్ భగాయత్లో 39 ఓపెన్ ప్లాట్ల విక్రయం ద్వారా వచ్చిన రూ.474 కోట్లు హెచ్ఎండీఏ ఖజానాలో ఉన్నాయి.